Naimisharanya Temple : అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు, వ్యాసుడు, శుకుడు వంటి ఎందరో మహారుషుల పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం.. నైమిశారణ్యం. గోమతీ నదీ తీరాన గల ఈ పుణ్యధామం.. 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటిగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉంది. లక్నోకు 94 కి.మీ దూరంలోని నైమిశారణ్యం.. వేలాది సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ.. భక్తులను నాటి కాలంలోకి తీసుకుపోతుందంటే ఆశ్చర్యం లేదు.
వాయుపురాణంలో నైమిశారణ్య ఆవిర్భావానికి సంబంధించిన ఒక గాథ ఉంది. మహాభారత యుద్ధానంతరం మునులంతా తమకు యజ్ఞయాగాదులు చేసుకునేందుకు ఒక ఉత్తమ ప్రదేశాన్ని సూచించమని.. బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. దీంతో ఆయన ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ‘మహర్షులారా! ఈ చక్రాన్ని దోర్లిన్చుకుంటూ వెళ్ళండి. దేని ‘నేమి'(ఇరుసు) ఎక్కడ ముక్కలైపోతుందో.. అదే మీకు అనుకూలమైన ప్రదేశం’ అని సూచించాడు. వారు దానిని దొరలించుకుంటూ వస్తుండగా.. ఒకచోట అది శిథిలమైంది. ‘నేమి’ శిథిలమైపడిన క్షేత్రం కనుకనే … అది నిమిషక్షేత్రం అయ్యింది. అదే కాలగమనంలో నైమిశారణ్యంగా పేరొందింది.
త్రేతాయుగంగా శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగా, లవకుశులను తొలిసారి కలిసిన ప్రదేశంగా, శౌనకాది మహామునులకు సూతుడు అష్టాదశ పురాణాలను వినిపించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఇక్కడే సీతాదేవి పేరిట.. ఒక గ్రామాన్ని శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడనీ, అదే నేటి సీతాపూర్ అయిందనీ చెబుతారు.
శౌనక మహర్షి 84 వేలమంది మునుల ముందు భాగవత పారాయణం చేసింది ఇక్కడే. మహాభారత గాథను వ్యాసుడు.. తన కుమారుడైన శుక మహర్షికి తొలిసారి వినిపించిన ప్రదేశమూ ఇదే. విశేషమైన ఫలితాలిచ్చేదిగా చెప్పే.. సత్యనారాయణ స్వామి కథను తొలిసారి ఇక్కడే సూతుడు మునులకు వినిపించాడు. ఆదిశంకరులు ఇక్కడే లలితాదేవిని దర్శించుకుని లలితా పంచకాన్ని రచించినట్లు చెబుతారు.
ఇక్కడ భక్తులు తప్పక చూడాల్సిన వాటిలో చక్రతీర్థానికి పక్కనే ఉండే భూతేశ్వరాలయం ఒకటి. పూర్వం గయుడు అనే రాక్షసుడు విష్ణుద్వేషంతో శివుని గురించి తపస్సు చేస్తాడు. అయితే.. వాడి వైరభక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై.. వరం కోరుకోమంటాడు. దానికి గయుడు.. ‘నువ్వు నాకు వరం ఇచ్చేంత గొప్పవాడివా.. ..! కావాలంటే నువ్వే నన్నేదైనా అడుగు..’ అన్నాడు. దానికి విష్ణువు ‘నా చేతిలోనే నువ్వు మరణించేలా వరం ఇవ్వు’ అన్నాడు. దానికి గయుడు సరేననగా.. విష్ణువు తన సుదర్శనంతో గయుడిని మూడు ముక్కలు చేస్తాడు. ఆ మూడు ముక్కల్లో ఒకటి నైమిశారణ్యంలో, మిగతా రెండు గయ, బదరీనాథ్లో పడ్డాయి. నాడు నైమిశారణ్యంలో పడిన ముక్క ఉన్నచోటే నేటి భూతేశ్వరాలయం ఉంది.
ఈ ఆలయానికి పక్కనే ఉన్న సరస్సునే చక్రతీర్థం అంటారు. వృత్తా కారంలోని ఈ సరస్సులో స్నానం చేస్తే.. అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రజల విశ్వాసం. అలాగే.. ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్నకొండపై వ్యాసుడు నివసించిన ప్రదేశం ఉంది. ఇక్కడే వ్యాసుడు చెబుతుండా.. గణపతి మహాభారతాన్ని రాశాడని చెబుతారు.
ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు దధీచి మహర్షి.. తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చి ఇంద్రుడికి బహూకరించారని పురాణగాథ.
నైమిశారణ్యం వచ్చే భక్తులకు ఇక్కడి బాలాజీ మందిరంలో ఉన్న మాతాజీ ఆశ్రమంలో వసతి, భోజన వసతి ఉంది.