secret Behind 116 : సాధారణంగా బంధువుల పెళ్లికి, వేడుకలకు వెళ్లినప్పుడు కానుకగా ఇచ్చే మొత్తానికి 116 కలిపి ఇస్తుంటాము. అలాగే… గణేశ మండపం చందాకి లేదా ఏదైనా దేవాలయ నిర్మాణం కోసమో కూడా ఇలాగే విరాళం ఇస్తుంటాము. ఇదెందుకో తెలుసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి తొంగిచూడాలి.
1947 వరకు మనం బ్రిటిషర్ల పాలనలో ఉన్నాము. అప్పట్లో దేశవ్యాప్తంగా వారు ముద్రించిన నోట్లు, నాణేలనే వాడేవారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం.. నిజాం ప్రభుత్వపు సొంత కరెన్సీ ఉండేది.
అయితే.. దేశమంతా ఉన్న రూపాయికి, హైదరాబాద్ ప్రభుత్వపు రూపాయికి మారకం విలువలో కాస్త తేడా ఉండేది.
అప్పట్లో.. నిజాం పాలనలో ఉన్న వనపర్తి, గద్వాల సంస్థానాధీశులు.. వేరువేరు ప్రాంతాలకు చెందిన పేరున్న తెలుగు కవులను, కళాకారులను పిలిచి, వారి పాండిత్యాన్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇచ్చేవారు.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా తీరాల కవులతో బాటు రాయలసీమ పండితులంతా తరచూ వారి సంస్థానాలకు వెళ్లి తమ పాండిత్యాన్ని ప్రదర్శించి కానుకలు అందుకునేవారు.
అలా వెళ్లిన సందర్భంలో వారికి అక్కడి పాలకులు.. సన్మానం చేసి.. నిజాం రాజు ముద్రించిన 100 రూపాయల నోటును నగదు బహుమతిగా ఇచ్చేవారు.
అయితే.. ఆ వంద నోటు తీసుకుని తమ ప్రాంతాలకు వెళ్లిన రాయలసీమ, సీమాంధ్ర కవులు.. వాటిని పెద్ద వ్యాపారస్తుల వద్దకు తీసుకెళ్లి మార్చుకునేవారు. ఈ క్రమంలో రూపాయ మారకవిలువగా వారికి కేవలం.. 86 రూపాయలు మాత్రమే వచ్చేవి.
‘అయ్యో.. ఎంతో కష్టపడి, ఎక్కడో ఉన్న గద్వాల, వనపర్తి పోయి.. పాండిత్యాన్ని ప్రదర్శిస్తే.. చివరికి వందరూపాయలూ దక్కలేదు.. (రూ. 14 తగ్గాయనే భాధ) అని వారు కాస్త నిరాశ పడుతూ అక్కడి వారికి చెప్పేవారు.
ఈ మాట ఆ నోటా ఈనోటా పడి చివరికి గద్వాల, వనపర్తి సంస్థానాధీశులకు చేరింది. దీంతో వారికి కూడా ‘అయ్యో పాపం.. నిజమే కదూ..’ అనిపించిందట.
దీంతో.. ‘మన నిజాం కరెన్సీ ఎంత ఇస్తే.. వారికి అక్కడ రూ. 100 అవుతుంది’ అని ఆరాతీయగా అది రూ. 116గా తేలింది. దీంతో అప్పటినుంచి కవులకు రూ. 116 కానుకగా ఇవ్వటం మొదలుపెట్టారు.
ఆ కవులు ఆంధ్ర, రాయలసీమలోని తమప్రాంతంలో మార్చుకోగా.. సరిగ్గా వంద రూపాయలు దక్కేవి. దీంతో వారూ సంతోష పడటం మొదలుపెట్టారు.
ఇక.. అప్పటి నుంచి ఎక్కడైనా ప్రయాణంలో పండితులు ఎదురైతే…‘అయ్యవారు నూట పదహార్లు పుచ్చుకుని వస్తున్నట్లున్నారు’ అని జనం పలకరించటం మొదలైంది.
కాలక్రమంలో.. ఇదే సామాన్యుల చదివింపులకు కూడా ప్రమాణమైన మొత్తంగా మారిపోయింది.