Talpagiri Ranganatha Temple: తెలుగునేల మీది అద్బుత వైష్ణవ క్షేత్రాల్లో తల్పగిరి క్షేత్రం ఒకటి. నెల్లూరు నగరంలోని 17వ శతాబ్దం నాటి తల్పగిరి క్షేత్రంలో రంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవార్లు ప్రధాన దైవాలుగా దైవంగా పూజలందుకుంటున్నారు. పెన్నానదీ తీరాన గల ఈ క్షేత్రంలో సాక్షాత్తూ ఆదిశేషుడే తల్పగిరిగా మారగా, దానిపై విష్ణువు .. రంగనాథుడిగా శయనించనేది పురాణ కథనం.
తమిళ నాడులోని శ్రీరంగం క్షేత్రాన్ని ఆదిరంగమని, కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని రంగనాథ ఆలయాన్ని మధ్య రంగమని, నెల్లూరులో తల్పగిరిని ఉత్తర రంగమని వైష్ణవుల భావన. ఇక్కడ రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. ఈ క్షేత్రంలో పెన్నానది శ్రీ రంగనాథస్వామివారి పాదాలు కడుగుతున్నట్లుగా ఆలయాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది.
పూర్వం కశ్యప మహాముని పౌండరీక యాగం చేశాడనీ, ఆ సమయంలో ఆ అగ్నిగుండం నుంచి వచ్చిన మూడు మహా అగ్ని కీలల్లో ఒకటి తల్పగిరి రంగనాథాలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షి ఆలయంగా, చివరిది వేదగిరి నారసింహ క్షేత్రంగా మారినట్లు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. మరో గాథ ప్రకారం, ఒకసారి విష్ణువు శ్రీదేవీ సమేతంగా భూలోక విహారం చేసేందుకు అనువైన ప్రదేశాన్ని చూడాలని ఆదిశేషుడిని ఆదేశించాడట. అయితే.. స్వామిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని ఆదిశేషుడు నేటి పెన్నాతీరంలో తల్పగిరిగా మారిపోయి, తనపైనే స్వామిని విశ్రమించమని కోరాడనీ, అదే నేటి క్షేత్రమనీ చెబుతారు.
ఇక్కడ భక్తులు దక్షిణ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ముఖమండపం గుండా గర్భాలయానికి ప్రదక్షిణ చేసిన భక్తులు లోనికి ప్రవేశించగానే శేష తల్పం మీద శయనించిన రంగనాథుడు, ఆయన పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఇక్కడి స్వామి విగ్రహం ఎడమ చేతి మీద ఉత్తర దిశగా తల పెట్టుకొని పడమర దిశను చూస్తుంటారు.
ప్రధాన ఆలయంలో స్వామివారి గర్భాలయానికి ఎడమ వైపు గోదాదేవి కొలువై ఉంటుంది. ఆలయంలో 12 మంది ఆళ్వారుల ఆలయాలు, ఆంజనేయుడి ఆలయం చూడదగిన ఇతర ప్రదేశాలు. ఆలయంలోని అద్దాల మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. మండపం మధ్యలోని కృష్ణుడి చిత్రపటం.. మనం ఎటునుంచి చూసినా మనల్నే చూస్తున్నట్టు ఉంటుంది.
Read More: మహాశివరాత్రి .. ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాధులు నయం..!
ఆలయపు రాజగోపురం భక్తులను ఔరా అనిపిస్తుంది. దీని ఎత్తు 95 అడుగులు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనూ ఈ రాజ గోపురం ప్రస్తావన ఉంది. జల ప్రళయం సంభవించి, పెన్నానది పొంగుతుందనీ, అప్పుడు ఈ గాలి గోపురం మీద వాలిన కాకి ఆ నీరు తాగుతుందనీ, అదే కలియుగాంతానికి గుర్తు అని నాడు వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ఉత్తర ద్వార దర్శనం, ఏటా మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల వేళ ఆలయం వైకుంఠాన్ని తలపిస్తుంది.