Subramanya Swamy Pooja : మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. నవంబర్ 27న షష్ఠి తిథి వచ్చింది. దేవతల సేనకు నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసింది ఈ రోజేనని చెబుతారు. కుమారస్వామి, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్యుడికి పేర్లు ఉన్నాయి. ఆరు ముఖాల ఉండటం వల్ల కుమారస్వామికి షణ్ముఖుడని కూడా పేరు. ఐదు ఇంద్రియాలు, మనస్సులకు ఈ ఆరు ముఖాలూ సంకేతాలు. అలాగే యోగ సాధనలోని షట్చక్రాలకు ఈ ఆరు ముఖాలూ ప్రతీకలు.
సుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపుడు. సుబ్రహ్మణ్య ఆరాధన యోగబలాన్ని, ఆరోగ్యఫలాన్ని, సంతానప్రాప్తినీ అనుగ్రహిస్తుంది. షష్ఠినాడు పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ప్రావరణ వ్రతం నిర్వహించాలని పెద్దలు చెప్తారు. చలికాలంలో వచ్చే ఈ పర్వదినాన పేదల చలి బాధను నివారించే వ్రతంలోని ఆంతర్యం చాలా గొప్పది. ఈ పర్వదినాన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించి, ఆ రూపంగా ఒక బ్రహ్మచారికి భోజనంపెట్టి, బట్టలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి గౌరవించడం సంప్రదాయం.
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు.
పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు సుబ్రమణ్య స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యంయే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి