Story of Shukracharya : శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు. రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు చాలా మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలున్నాయి. వాటిలో మొదటిది సురాపానమైతే, రెండవది కూతురిపై ప్రేమానురాగాలు. శుక్రాచార్యునికి అపురూపమైన, అత్యద్భుతమైన మృతసంజీవనీ విద్య తెలుసు.దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై, మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ, రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దాంతో రాక్షసుల బలం పెరుగుతూ, దేవతల బలం తగ్గుతూ వస్తోంది.
ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించి ఆ మృతసంజీవని విద్యను నేర్చుకోవాలనుకున్నారు. శుక్రుడు దేవతలకు ఆ విద్యను బోధించడు కాబట్టి ఎలాగోలా నేర్పుగా ఆ విద్యను సంగ్రహించాలి. అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యమూ కలిగిన వారు కావాలి. ఆ పని తాను చేస్తానంటూ కచుడు ముందుకొచ్చాడు.
కచుడు బృహస్పతి కుమారుడే. దేవతలందరూ వెనుకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చిన కచుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి. శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించు. అప్పుడు నీకు ఎలాంటి ప్రమాదమూ ఉండంటూ చక్కటి దారిని చూపించాడు బృహస్పతి.
దేవతల కోరికతో శుక్రుని వద్దకు వెళ్ళాడు కచుడు . మహాత్మా, తాను దేవగురువు బృహస్పతి పుత్రుడనని చెప్పి పరిచయం చేసుకుంటాడు. ముందు ఒప్పుకోకపోయినా, విద్యపట్ల అతనికున్న తపన, వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడిన శుక్రుడు సంతోషించి, తన వద్దనే ఉంచుకుని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది నచ్చని మిగిలిన రాక్షసులు కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు. గురువు బోధించిన విద్యలన్నిటినీ నేర్చుకుంటూ, ఎంతో వినయంతో, భక్తి గౌరవాలతో గురువుకు సేవలు చేయసాగాడు కచుడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు తట్టుకోలేకపోయారు. ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేశారు రాక్షసులు.
ఏం జరిగిందో దివ్యదృష్టితో గ్రహించిన శుక్రాచార్యుడు. మృత సంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు. ఈవిధంగా రెండుమూడుసార్లు జరిగింది. చివరికి రాక్షసులు కచుణ్ణి చంపి, కాల్చి బూడిదచేసి, ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించేస్తారు. కచుడు ఎక్కడున్నాడా అని దివ్యదృష్టితో చూసిన శుక్రుడికి కచుడు బూడిదరూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది. పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి, తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు.
కూతురిపై ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా, రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చిందని ఆలోచించిన శుక్రుడికి సిగ్గు వేసింది.