Story Behind Tirumala Tirupati Govinda Namalu :తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని భక్తులు ఎన్నో పేర్లతో తలచుకుంటారు. కానీ.. వాటిలో ‘గోవింద’ నామానికి ఉన్న ప్రత్యేకత మరే పేరుకీ లేదు. అలిపిరి నుంచి కాలి నడకన వచ్చే భక్తుల మొదలు.. ఆనంద నిలయంలో స్వామి దివ్య దర్శనం చేసుకునే వరకు భక్తులు.. ప్రతి నిమిషం ‘గోవిందా.. గోవిందా’ అని భక్తితో స్వామిని తలచుకుంటూనే ఉంటారు. మరి ఇంతకూ ‘గోవిందా’ అనే మాటకు అర్థమేమిటి? ఆ పేరు స్వామికి ఎలా వచ్చింది అనే దాని వెనక చాలామందికి తెలియని ఒక అరుదైన కథ ఉంది.
కలియుగం ఆరంభంలో తిరుమల గిరుల మీద శ్రీ వేంకటేశ్వరుడు కొలువయ్యాడు. ఆ సమయంలో దక్షిణ దేశ యాత్రకు వచ్చి, తిరుమలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని స్వామివారు చూశారు. తాను కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల గిరిమీద కలియుగాంతం వరకు ఇక్కడే నివసించేందుకు తిరుమలకు రాబోతున్నాననీ, తనకు రోజూ పాలు తాగే అలవాటు ఉందనీ, కనుక తనకు ఒక ఆవును ఇవ్వమని ఆ మునిని స్వామివారు కోరతాడు. అఖిలాండ బ్రహ్మాండకోటి నాయకుడైన శ్రీ వేంకటేశ్వరుడే స్వయంగా తనను గోదానం అడిగినందుకు పొంగిపోయిన అగస్త్యుడు.. ‘మీరు తిరుమలకు రావాలని నిర్ణయించుకున్నారు గానీ.. లక్ష్మీదేవిని తీసుకుని రాలేదు. కనుక మీరిద్దరూ కలిసి ఇక్కడ నివసించటానికి వచ్చిన రోజు.. తప్పకుండా మీరు కోరినట్లుగా గోవును ఇస్తాను’ అని మాట ఇచ్చాడు.
Read More : భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుండంటే..
అనుకున్న ప్రకారమే.. స్వామి కొన్నాళ్లకు లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించి, తిరుమలకు చేరుకుని, అగస్త్యుడిని కలసి పాత వాగ్దానాన్ని గుర్తు చేద్దామని ముని ఆశ్రమానికి వెళ్లాడు. అయితే.. ఆ సమయంలో అగస్త్యుడు ఆశ్రమంలో లేకపోవటంతో ఆయన శిష్యుడికి వచ్చిన పని చెప్పాడు. వచ్చినది సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరుడు అని గుర్తించని ఆ శిష్యుడు ‘సరే.. మా గురువు గారు రాగానే మీరు వచ్చిన పని గురించి ఆయనకు చెబుతాను’ అని జవాబివ్వగా, స్వామి వెనుదిరిగి పోయాడు. కాసేపటికే అగస్త్యుడు ఆశ్రమానికి రాగా.. శిష్యుడు జరిగినది చెప్పి.. ఇప్పుడే స్వామి ఆ దిశగా వెళ్లాడని చూపిస్తాడు.
దీంతో అగస్త్యుడు ‘అయ్యో.. స్వామి వారు వచ్చినప్పుడు నేను లేనే..’ అనుకుంటూ తన పాకలోని మంచి ఆవును ఒక దానిని విప్పుకుని గబగబా స్వామి వెళ్లిన దారిలో పరుగులు పడుతూ ‘గోవు ఇందా.. గోవు ఇందా’ అని పెద్దగా అరుచుకుంటూ వెళ్లాడు. అలా ఆయాసపడుతూ కన్నీరు కార్చుతూ 108 సార్లు ‘గోవు ఇందా’ అనే క్రమంలో అది ‘గోవిందా’ అయింది. సరిగ్గా.. 108వ సారి ఆయన గోవిందా అనగానే.. గబగబా నడిచి పోతున్న స్వామి ఆగి అక్కడ నిలబడిపోగా, అగస్త్యుడు వచ్చి స్వామికి గోవును అప్పగించి నమస్కరించాడు.
ఆ మునీంద్రుడి భక్తికి పొంగిపోయిన శ్రీ వేంకటేశ్వరుడు ‘గోవు ఇదిగో.. తీసుకో’ అనే అర్థంతో నీవు నేడు పిలిచిన ఈ నామం.. నా పేర్లతో ముందువరసలో నిలిచిపోతుంది. ఎవరైతే నన్ను 108 సార్లు ఈ నామంతో భక్తితో పిలుస్తారో వారికి కలియుగాంతం వరకు నేను రక్షగా నిలుస్తాను. అని ఆ ఆవును స్వామి స్వీకరించాడు. అలా.. నాటి నుంచి నేటి వరకు పండితుల నుంచి పామరుల నోట.. ఈ నామం మారుమ్రోగుతూనే ఉంది.