Steel Coins : దైవదర్శనం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు నదులు, గుండాల్లో నాణాలు, డబ్బులు వేయడం సర్వసాధారణం. డిజిటల్ పేమెంట్లు పుట్టని పాత రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యంగా ఇంట్లో వాళ్లతో పుణ్యక్ష్రేతాలకు వెళ్తే రూపాయో , రెండు రూపాయలో నదిలోనే గుడిలోని గుండాల్లో వేసి దండం పెట్టుకునేవారు. గోదావరి, కృష్ణ లాంటి జీవ నదులపై వెళ్లేటప్పుడు కూడా నాణాలు వేసి నమస్కరించే వారు. అలా చేయమని మన పెద్ద వాళ్లు మనకు చెబుతుండే వారు.
ఇప్పుడంటే.. స్టెయిన్ లెస్ స్టీల్తో రూపాయి, రెండు, ఐదు రూపాయల కాయిన్స్ను తయారు చేస్తున్నారు. కానీ అప్పట్లో నాణేలన్నీ.. రాగితో తయారు చేసేవారు. కాబట్టి ఆ నాణేలను నదిలోకానీ, దేవుడి గుడి ప్రాంగణంలో ఉండే గుండాల్లో వేయడం వల్ల నీరు కాస్త శుభ్రపడేది. స్వచ్ఛంగా మారేది. అప్పట్లో ఎక్కువగా నదుల్లో నీరే తాగేవారు. కాబట్టి.. రాగి నాణేలు వేస్తే.. నీరు శుభ్రమై తాగడానికి పనికొస్తుందని నమ్మేవారు.
నీటిని శుభ్రం చేసే క్వాలిటి రాగికి ఉంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. అందుకే అప్పట్లో ఎక్కువగా రాగి ప్లేట్లు, రాగి పాత్రలనే వాడేవారు.ఇప్పుడు కూడా రాగి వాటర్ బాటిల్స్ ట్రెండ్గా మారిపోయింది. ఎవరు చూసినా రాగితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. వాటర్ ఫ్యూరిఫైర్స్లో కూడా రాగిని ఉపయోగిస్తున్నారు.
ప్రజలు భక్తితో ఈ పని చేస్తే, అది కొందరికి ఉపాధి. నదిలో దిగి, చిల్లర ఏరుకుని ఉపాధి పొందేవారు ఉండటం విశేషం. నాణాలు వేసే భక్తి పరోక్షంగా కొందరికి అన్నం పెడుతుంది. కానీ ఈ రోజుల్లో స్టెయిన్ లెస్ స్టీలుతో తయారు చేసిన నాణేలను నీళ్లలో వేస్తే నష్టాలే ఎక్కువ. ఎందుకంటే.. నీటిలో ఎక్కువ సేపు ఆ కాయిన్స్ ఉంటే తుప్పుప ట్టిపోతాయి. ఆ నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. హెల్త్ పాడవుతుంది. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు రాగి నాణేలు కాకుండా ఇప్పుడున్న స్టెయిన్ లెస్ స్టీలు కాయిన్స్ను మాత్రం నీళ్లలో వేయకండి. ఇలా వేయడం వల్ల పర్యావరణానికి హాని చేసినవారవుతారని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.