Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. 11 రోజులపాటు జరిగే ఉత్సవాలకు 5 రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించినట్లు ఈవో లవన్న చెప్పారు. క్షేత్ర పరిధిలో యాత్రికులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్లు 08524 – 287004, 28728, 287289 లకు ఫోన్ చేసి చెప్పుకోవచ్చు . .
ఈనెల 15న రావణ వాహనసేవ, 16న పుష్ప పల్లకీ సేవ, 17న గజ వాహనసేవలను ఆలయ అధికారులు నిర్వహించానున్నారు. 18వ తేదిన మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవను నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. 19వ తేదిన రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21వ తేదిన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించనున్నారు.
జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయంలో మాత్రమే స్పర్శ దర్శనం కల్పించగా సామాన్య భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలను వివిధ స్లాట్స్ ద్వారా కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇరుముడితో వచ్చే శివస్వాములకు చంద్రావతి కళ్యాణ మండపంలో 4 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలను కల్పిస్తున్నారు. అదేవిధంగా కాలినడకన వచ్చే భక్తులను గుర్తించి వారికి స్వామి అమ్మవార్ల దర్శనాలను కల్పించడం కోసం ప్రత్యేక కంకణాలను ఇస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా శీఘ్ర, అతి శీఘ్ర, ఉచిత దర్శనాలకు బుకింగ్ చేసుకోవచ్చు .
ఉచిత దర్శనానికి 14 కంపార్ట్మెంట్లు, శ్రీఘ్ర దర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండేందుకు క్యూ కాంప్లెక్స్లను సిద్దం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా సుమారు 30 నుంచి 40 లక్షల లడ్డూ ప్రసాదాల వితరణ కోసం 15 ప్రత్యేక కౌంటర్లు…మహిళలకు, దివ్యాంగుల కోసం అదనంగా మరో 5 కౌంటర్లను సిద్దం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పురవీధులన్నీ విద్యుదీప కాంతులతో ఆధ్యాత్మిక వాతావరణంతో దేదిప్యమానంగా శోభిల్లుతుంది.