Sri Venkateswara Temple:- శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులకి టీటీడీ అపూర్వకానుక ఇస్తోంది. జమ్ము నుంచి కాట్రా మార్గంలో రుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తోంది. ఉత్తరాదిన బాలాజీగా పిలుచుకునే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించే పనులు తుది దశకి చేరుకున్నాయి. జూన్ 8న ఆలయ మహా సంప్రోక్షణ నిర్వహించాలని టీటీడీ ముహూర్తం నిర్ణయించింది. జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం కోసం రాష్ట ప్రభుత్వం 62 ఎకరాలు కేటాయించింది. సుమారు 30 కోట్ల వ్యయంతో బాలాజీ గుడిని టీటీడీ నిర్మిస్తోంది.ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట జరగనుంది. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ నిర్వహించి ఆతర్వాత భక్తులకు ఉచిత దర్శనం కల్పించనుంది.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట ఉన్న ప్రాంతంలో ఈ ఆలయం నిర్మాణం సాగుతోంది. పదిహేదు ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్తోపాటు సరిహద్దు గోడ, వేద పాఠశాల, సిబ్బంది క్వార్టర్స్, భక్తుల వసతి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ములో 2021 జూన్ లో 33.22 కోట్ల అంచనా వ్యయంలో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టింది. అందుకు నిబంధనల ప్రకారం ఆలయం నిర్మాణం చేపట్టడం సాధ్యం కాలేదు.
హిందువులు ఎక్కువగా ఉండే జమ్ములో ఇప్పటికే శ్రీరామ వీరేశ్వర ఆలయం, రఘునాధ మందిరంతోపాటు మరికొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటి సరసన టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం చేరనుంది. హిమాలయా పర్వత సొగసుల మధ్య వెంకటేశ్వరస్వామి కొలువదీరనున్నాడు. మందిరాల నగరంగా పేరున్న జమ్ములోని మంచు కొండల మధ్య గోవిందుడి దర్శనం భక్తులకి కొత్త అనుభూతి ఇస్తుందని అంచనా వేస్తున్నారు.. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల వరకు రాలేని వారి కోసం టీటీడీ దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆలయాలను నిర్మిస్తోంది. ఆందులో భాగంగా జమ్ములో ఆలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది. ధర్మ ప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆలయాల నిర్మిస్తున్నారు. త్వరలో ముంబై ఆలయానికి శంకుస్థాపన జరగబోతోంది.