Swarna Pushparchrana In Simhachalam: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో భక్తులు ఫిబ్రవరి 25న వైభవంగా స్వర్ణపుష్పార్చన జరిపించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి, అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు.
శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామివారికి అత్యంత వైభవంగా జరిపిన స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచల పుణ్య క్షేత్రంలో పండితుల వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగిందని అన్నారు.
ఉత్సవంలో భాగంగా అర్చకులు తెల్లవారుజామునే స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామివారిని అందంగా అలంకరించారు.
Read More: నష్టాలను దూరం చేసే.. నవగ్రహ ఆలయాలు..!
అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోకి దేవి దేవతలను అధిష్టించారు. వేద మంత్రాలతో, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ బంగారు సంపెంగలతో స్వర్ణపుష్పార్చన సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించారు.
కాగా.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ప్రతి ఆదివారం, గురువారం స్వర్ణసంపెంగ పుష్పాలతో స్వామికి అర్చన జరిపిస్తుంటారు. అయితే, 2019 వరకూ ఒ భక్తుడు స్వామికి వారికి కానుకగా ఇచ్చిన 108 సంపెంగ పుష్పాలతో స్వర్ణపుష్పార్చన నిర్వహిస్తూ వచ్చారు.
ఆ భక్తుడు ఇచ్చిన పుష్పాలు కేవలం బంగారు పూతవి కావడంతో పక్కా స్వర్ణపుష్పాలను తయారు చేయించాలని దేవస్థానం అధికారులు 2019 ఫిబ్రవరిలో నిర్ణయించారు. కోయంబత్తూరుకి చెందిన ఒక వ్యాపార సంస్థ వైభవ్ జ్యూయలర్స్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో స్వర్ణ పుష్పం 18 గ్రాములు బరువుతో మోత్తం 132 స్వర్ణపుష్పాలను తయారు చేపించారు. ఒక్కో స్వర్ణ పుష్పానికి 64 వేలు ఖర్చుకాగా.. దాతల నుంచి విరాళాలను సేకరించారని ఆలయన ఈవో తెలిపారు.