Lakshmi Narasimha Swamy Kalyanam:దక్షిణ కాశీగా పేరున్న అంతర్వేది తీర్థం ముగింపు దశకు చేరింది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా అంతర్వేది శ్రీలక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. శ్రీ లక్ష్మి నారసింహుడు పెళ్లికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలు ప్రతి ఏటా విద్యుత్ కాంతుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. స్వామి వారి కల్యాణోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. అంతర్వేది తీర్థం పేరుతో జరిగే తిరునాళ్లకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.
సాగరతీరంలో సాగర సంగమం జరిగే చోట ప్రశాంతమైన వాతావరణంలో కొపనాతి కృష్టమ్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు శ్రీ రాజా కలిదిండి లక్ష్మీ నరసింహ బహుద్దూర్ వారిని ధర్మకర్తగా నియమించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రతి ఏటా జరిగే కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఫిబ్రవరి 1వ తేదీన రథోత్సవం వైభవంగా జరిగింది., 5వ తేదీ ఆదివారం చక్రస్నానం, 6వ తేదీ సోమవారం తెప్పోత్సవంతో కల్యాణోత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన కేంద్రాలను నిర్మించారు.
ఏడుపాయలుగా చీలిన గోదావరిలో, వశిష్ఠ గోదావరి దగ్గర త్రికోణాకార లంకలో అంతర్వేది ఉంటుంది. ఇక్కడే గోదావరి, బంగాళాఖాతంలో సమ్మిళితమవుతోంది. నృసింహుడి సోదరిగా భావించే గుర్రాలక్కతో స్వామి ఇక్కడ విలసిల్లడంతో ఈ ప్రదేశాన్ని అన్నా చెల్లెళ్ల గోదారి గట్టుగా పిలుస్తుంటారు. బ్రహ్మ గౌతమీనదీ తీరంలోనే మహా రుద్ర యాగాన్ని చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సందర్భంలోనే పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వరస్వామి లింగాకృతిని ఇక్కడ ప్రతిష్ఠాపన చేశాడనేది పురాణ కథనం. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు.