Sri Kanaka Mahalakshmi Temple : నాటి విశాఖ గ్రామదేవతగా.. నేటి ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవంగా శ్రీ కనక మహాలక్ష్మీదేవి మన విశాఖపట్టణం నగరంలో పూజలందుకుంటోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో నాటి పాలకులు అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బురుజుపేట బావిలో పడేసి రక్షించారట.
తర్వాత అమ్మవారు భక్తులకు కలలో కనిపించి.. తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడంతో అలాగే ప్రతిష్టించి పూజించారు. కానీ.. రోడ్డు మార్గంకోసం బ్రిటిషర్లు అమ్మవారి మూర్తిని పక్కకు జరిపారట. దీంతో నగరాన్ని ప్లేగు వ్యాధి వణికించి, భారీ ప్రాణనష్టం జరగ్గా.. తిరిగి అమ్మవారి విగ్రహాన్ని యధాస్థానంలో ప్రతిష్టించాకే.. వ్యాధి తగ్గిందట.
మరో కథనం ప్రకారం.. మరో కథనం ప్రకారం.. ఓ బ్రాహ్మణుడు విశాఖ మీదగా కాశీకి వెళ్తూ బురుజుపేటకు చేరుకుంటాడు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అక్కడ అమ్మవారు ప్రత్యక్షమై.. తాను ఇక్కడ కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని అమ్మవారు కోరుతుంది.
అయితే, ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని బ్రతుమిలాడుకుంటాడు. దీంతో ఆగ్రహించిన అమ్మవారు తన ఎడమచేతిలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధంకాగా, అతడు శివుడిని ప్రార్థిస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై అమ్మవారి ఎడమచేతిని తీసేసి.. ఆమెను శాంతమూర్తిని చేశాడట. అందుకే ఇక్కడి అమ్మవారి విగ్రహానికి ఎడమచేయి ఉండదు.
ఇక్కడ అమ్మవారి విగ్రహానికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. కుల, మత, వర్గాలకు అతీతంగా ఎవరైనా నేరుగా గర్భాలయంలోని అమ్మవారిని తాకి సేవించుకోవచ్చు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు.
సంవత్సరంలోని మిగిలిన పదకొండు నెలలో ఎంతమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారో.. ఒక్క మార్గశిర మాసంలోనే అంతమంది భక్తులు దర్శనానికి వస్తారు.