Shivalayam Pradakshina : ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటాం. అయితే.. ఇతర దైవీదేవతల కంటే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు కొన్ని నియమాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. భక్త సులభుడైన పరమేశ్వరుడికి ఈ నియమాల ప్రకారం ప్రదక్షిణ చేస్తే అనంతమైన పుణ్యాన్ని సాధించవచ్చని లింగపురాణం చెబుతోంది. ఆ నియమాలేంటో మనమూ తెలుసుకుందాం. ఈసారి శివాలయానికి వెళ్లినప్పుడు అలాగే ప్రదక్షిణం చేద్దాం.
శివాలయంలో చేసే ప్రదక్షిణను చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. అంటే.. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లి.. అక్కడ చండీశ్వరుని దర్శించుకొని తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు చేరుకోవాలి. అనంతరం ధ్వజస్తంభం వద్ద ఒక్క క్షణం పాటు ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం (అభిషేక జలం బయటికి వెళ్లే ఆవు ముఖం) వరకు వెళ్లి.. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు లెక్క. ఈ ప్రదక్షిణనే చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. ఇలా మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి.
ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో సోమసూత్రాన్ని దాటి ముందుకు వెళ్ళకూడదు. సోమసూత్రం నుంచి అభిషేక జలం బయటికొస్తుందనీ, ఇక్కడ శివుని ప్రమధగణాలుంటాయని విశ్వాసం. ఈ జలం దాటి ముందుకు వెళ్లి చేసే ప్రదక్షిణ ఫలితాన్ని ఇవ్వదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే.. సాధారణంగా ఆలయం చుట్టూ చేసే 10వేల ప్రదక్షిణలు.. ఒక్క చండి ప్రదక్షిణతో సమానమని లింగా పురాణం చెబుతోంది.
అలాగే శివ దర్శనం కోసం వెళ్లినప్పుడు పొరబాటున కూడా లింగానికి, నందికి మధ్య నడవకూడదు. వెళ్లవలసి వస్తే.. నందీశ్వరుడి వెనుక నుంచి మాత్రమే వెళ్లాలి.
అంతేకాదు.. విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. కాస్త పక్కగా నిలబడి శివుడిని, మరోవైపు నందీశ్వరుడిని చూసి నమస్కరించుకోవాలి.