Shiridi Sai Baba : మానవులును సన్మార్గంలో నడిపించడానికి పరమాత్మయే.. షిరిడీలో మనిషి రూపంలో సద్గురు సాయినాథుడుగా అవతరించాడు. ఒక సాధారణ మానవుడిగా ఈ భూమ్మీద జీవించిన సాయినాథుడు.. భక్తుడు భగవంతుడిని చేరేందుకు కొన్ని సులభమైన, ఆచరణ సాధ్యమైన మార్గాల గురించి తరచూ చెబుతూ ఉండేవారు.
తన దగ్గర చదువుకునేందుకు వచ్చిన అనేక మంది శిష్యుల్లో శ్రద్ధగా చదివి, క్రమశిక్షణగా ఉండేవారి పట్ల గురువు ఎక్కువ వాత్సల్యం చూపుతాడో.. అలాగే, తనను రోజూ పూజించి, భజించేవారి కంటే.. తను చెప్పిన దానిని నిజ జీవితంలో ఆచరించే కర్మయోగుల వంటి భక్తులు దూరం నుంచి ఒక్క నమస్కారం పెట్టినా భగవంతుడు పొంగిపోతాడని బాబా అనేవారు.
అందరినీ ప్రేమించమని, నిన్ను ఆశ్రయించిన దీనులను, బలహీనులను ఆదరించి అండగా నిలవమని, అన్ని జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడనీ, వాటి పట్ల దయగా ఉండమని బాబా చెబుతుండేవారు. రోజూ తాను ఇంటింటికీ తిరిగి తెచ్చిన భిక్షను ఒక పాత్రలో వేసి కలిపి, ముందుగా పశు పక్ష్యాదులకు ఆహారంగా అందించేవారు. ఎవరైనా రోగంతో బాధ పడుుతుంటే వారికి డబ్బు సాయం, వైద్య సేవ చేయకపోయినా.. కనీసం వారికి మాటసాయం చేయటమో, ఓదార్పు కలిగించే రెండు మాటలు మాట్లాడటమో చేసి ధైర్యం చెప్పాలని బాబా బోధించేవారు.
పిట్టకు గుప్పెడు గింజలు, దాహానికి చెంబెడు నీళ్లు, ఆవుకు పట్టెడు గ్రాసం పెట్టినా తనకు పెట్టినట్లేనని బాబా అనేవారు. ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని చెత్త బుట్టలో పడేసేకంటే.. అందులో కాస్త పాలో, పెరుగో కలిపి ఆప్యాయతతో ఆకలిగొన్న జీవాలకు పెట్టొచ్చుకదా అని పదేపదే బాధపడుతూ చెప్పేవారు. ఇదే భక్తుల నుంచి తాను ఆశించే దక్షిణ అని సాయిబాబా చెబుతుండేవారు.
ఇలా బాబా మానవాళికి సూచించిన సులభమైన సందేశాలను ‘నిజంగా నువ్వు చెప్పినట్లుగానే మేం ఆచరిస్తున్నాం’ అని ఆయన ముందు నిలబడి చెప్పినా సాయినాథుడు ఎంతో ఆనందపడతాడు. ఆశీర్వదిస్తాడు. అదే భక్తులుగా మనం బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ.