Shirdi : మే1 న షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులకి ఇబ్బందులు తొలగిపోయాయి. బంద్ నిర్ణయాన్ని షిరిడీ సాయి గ్రామస్థులు వెనక్కి తీసుకున్నారు. దీంతో షిర్డీలో దుకాణాలు, వ్యాపార సంస్థలు యధావిధిగా తెరుచుకోనున్నాయి. సాయినాధుడ్ని దర్శించుకునే భక్తులు ఎప్పటిలాగానే షిరిడిలో ప్రవేశించవచు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో షిర్డీలో బంద్ ఆలోచనను స్థానికులు విరమించుకున్నారు.
షిర్డీలో బంద్ కొనసాగించట్లేదని ప్రకటించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ స్పెషల్ ఫోర్సు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై షిర్డీ గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు విషయంలోను ప్రభుత్వం ముందు గ్రామస్థులు డిమాండ్ ఉంచారు. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఏర్పాటు, షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
సీఐఎస్ఎఫ్ భద్రత తమ ఊరికి , గుడికి అవసరం లేదని షిర్డి గ్రామస్థులు ప్రభుత్వానికి గట్టిగా చెప్పారు. స్థానికుల ఆందోళనతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలిచింది. ఈవిషయంలో న్యాయపరంగా పోరాడతామని ప్రకటించింది. ఇప్పటి వరకు షిరిడీలో భద్రత అంతా సంస్థాన్ ట్రస్ట్, మహారాష్ట్ర పోలీసుల చేతుల్లోనే ఉండేది. కానీ నాలుగేళ్ల క్రితం కోర్టు ఓ వ్యక్తి వేసిన పిటిషన్ వల్ల సీఐఎస్ఎఫ్ భద్రతను నియమించాలని కేంద్రం నిర్ణయించింది.
దీంతో షిర్డీ గ్రామస్థులు తమకు కేంద్ర బలగాల అవసరం లేదని తేల్చి చెప్పాయి. సీఐఎస్ఎఫ్ బలగాలు అడుగుపెడితే షిర్డీ బంద్ చేస్తామని గట్టిగానే చెప్పాయి. దీంతో కేంద్రం కూడా గట్టిగా పట్టుపట్టే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం సమస్య సద్దుమణిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా షిర్డీ భక్తులు సాయినాథుడ్ని దర్శించు కోవచ్చు.