Sabarimala : శబరిమల అయ్యప్ప భక్తులతో నిండిపోతోంది. కరోనా పూర్తి స్థాయిలో తగ్గడంతో హరిహరసుతుడ్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య భారీ పెరిగింది. ఊహించినట్టుగా ఎక్కువమంది స్వాములు స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు.ఎక్కడ చూసినా భక్తుల రద్దే కనిపిస్తోంది. ఆలయం అధికారులు దర్శనాల సమయం పెంచినా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. స్వామి వారి దర్శనం కోసం దాదాపు 4 గంటల సమయం పడుతోంది. ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
కరోనా తర్వాత పూర్తి స్థాయిలో గుడి తలుపులు తెరుచుకోవడంతో భక్తుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెరిగిందంటున్నారు అధికారులు.
పంబా ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతోంది. చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్పస్వాములు స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు.
ఈనెల 28 సోమవారం ఒక్కరోజే 70 వేల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.
భక్తుల రద్దీతో శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. కేవలం 10 రోజుల్లోనే 52 కోట్లు రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంత గోపన్ తెలిపారు. అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్ల ఆదాయం రాగా అరవణ విక్రయంతో రూ.23.57 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. దేవస్థానంలో హుండీల ద్వారా రూ. 12.73 కోట్ల ఆదాయం వచ్చింది.
మరోవైపు విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌరవిమానయానశాఖ వెసులుబాటు కల్పించింది . భక్తులు సంప్రదాయంగా తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. భక్తుల రద్దీ పెరిగేందుకు ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది