Roti festival began in Nellore Darga lakhs of devoties coming every year
అది మత సామరస్యంగా అందరూ ఐకమత్యంతో జరుపుకునే పండుగ..ప్రతి సంవత్సరం సంప్రదాయ బద్దంగా భక్తులంతా కలిసి తమ కోర్కెలు తీరడం కోసం ఎంతో ఉత్సాహంతో 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఇంతకీ ఆ పండుగ ఏమిటంటే రొట్టెల పండుగ. నెల్లూరు జిల్లాలో బారాషహీద్ దర్గా వద్ద మొహరం పండుగ రోజునుంచి 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుపుకుంటారు. ఏపీ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించడం విశేషం. అందుకే లక్షల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాధికారులు సౌకర్యాలు కల్పిస్తారు. కేవలం నెల్లూరు చుట్టుపక్కలే కాకుండా పొరుగు రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు. విదేశాలనుంచి కూడా ఇక్కడికి వచ్చి ముక్కులు తీర్చుకోవడం విశేషం. ఈ ఏడాది దాదాపు 20 లక్షల భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వర్ణాల చెరువు
దర్గాను దర్శించుకున్న అనంతరం దగ్గరలోని స్వర్ణాల చెరువువద్దకు భక్తులు చేరుకుంటారు. భక్తులు తమ కోర్కెలు తీరడం కోసం రొట్టెలను అవతల వ్యక్తులకు ప్రసాదం కింద ఇస్తుంటారు. అవి స్వీకరించే వ్యక్తి తాను ఏదైనా కోరుకుని స్వీకరిస్తాడు. కోరిన కోరిక తీరగానే మరుసటి సంవత్సరం వచ్చి రొట్టెలను పంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అక్కడ అమ్మకం దారులు కూడా సంతానానికి ఓ రొట్టె, ఉద్యోగ ప్రాప్తికి ఓ రొట్టె, వివాహం కావాలనుకునేవారికి మరో రొట్టె ఇలా 12 రకాల కోర్కెల రొట్టెలను వేటికవి విడివిడిగా అమ్ముతుంటారు.
కోర్కెలు తీర్చే రొట్టెలు
మొహరం రోజున ఇలా రొట్టెలు పంచితే వెంటనే కోర్కెలు తీరతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. అయితే ఈ రొట్టెల పండుగ కేవలం ముస్లిం మతస్తులకే పరిమితం కాదు. వేరే ఏ మతానికి చెందిన వారైనా ముక్కులు చెల్లించుకోవచ్చు. దీనితో కులమతాలకు అతీతంగా మత సామరస్యంతో ఈ రొట్టెల పండుగ జరుపుకోవడం విశేషం. అయితే మొదట్లో మొహరం రోజునే ఈ వేడుక నిర్వహించేవారు. క్రమంగా భక్తుల సంఖ్య లక్షల్లో చేరుకుంది. దీనితో ఈ పండుగను 5 రోజుల పాటు నిర్వహించేలా చేస్తున్నారు.
12 మంది యుద్ధవీరుల సమాధులు
ఇక్కడ 12 మంది యుద్ధంలో వీరమరణం పొందిన వారి సమాధులు దర్గాలో ఉంటాయి.అందుకే ఇక్కడి మట్టి, నీరు,గాలి అన్నీ కూడా ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు.స్వర్ణ నదిలో స్నానాలు చేసి ఈ సమాధులను దర్శించుకుంటే ఆరోగ్యంతో పాటు సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమం అయినాక రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఐదురోజుల రొట్టెల పండుగలో తొలి రోజున షాహాదత్ అంటారు. ఆ రోజున సమాధులను శుభ్రం చేస్తారు. రెండో రోజు రాత్రి గంధోత్సవం జరుపుతారు. మూడో రోజు అంటే మొహరం రోజున రొట్టెల పండుగ చేస్తారు. నాలుగో రోజున తహలీల్ ఫాతెహా అని చివరి రోజున ఉత్సవం ముగింపు కార్యక్రమం ఉంటుందని రొట్టెల కమిటీ సభ్యులు చెబుతున్నారు.
నెల్లూరుకే తలమానికం
నెల్లూరు ప్రాంతానికే తలమానికంగా నిలచిన రొట్టెల పండుగను ఎంత మంది భక్తులు వచ్చినా సంయమనం పాటించి జరుపుకోవడం విశేషం. ఏపీ ప్రభుత్వం దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. నదీ పరిసరాలలో సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. స్నానాలు చేసి వచ్చిన మహిళా భక్తులు దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.