దేశమంతా.. అంతెందుకు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో, ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. పూరీ జగన్నాథుడి ఆలయంలో రహస్యాలకు నెలవైన రత్నాభాండాగారం తెరిచే రోజు ఫిక్సయింది. జులై 14న రత్న భండార్ ఇన్నర్ ఛాంబర్ తెరవబోతున్నారు. 1985లోనూ జులై 14నే లోపలికి వెళ్లారు. అదే చివరిసారి కూడా. 2018 ఏప్రిల్ 4న గది తలుపుల దాకా 16 మంది సభ్యులతో ఉన్న టీమ్ వెళ్లింది. కీ దొరకలేదన్నారు. కానీ భయంతో వెనక్కు వచ్చేశారన్న వాదనా ఉంది. కొందరు మాత్రం సాహసించి కిటికీల్లోంచి చూశారు.
పెద్ద పెద్ద పెట్టెలకు వస్త్రాలు చుట్టి ఉండడాన్ని గుర్తించారు. పై పెచ్చులు ఊడిపడి ఉన్నాయి. గోడల్లో తేమ ఉంది. అంతా చీకటి.. ఇక అంతే అందరూ అక్కడి నుంచి కేవలం 40 నిమిషాల్లోనే వెనక్కు వచ్చేశారు. 12వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం కావడం, పునాదుల్లో, నేలమాళిగలు ఉండడంతో ఈ ఆలయం భద్రత కోసం రత్న భండార్ లోపలి గదులను తనిఖీ చేయాలని, ఆ గోడలు ఏ కండీషన్ లో ఉన్నాయో చూడాలి గతంలోనే భారత పురావస్తు శాఖ ఒడిశా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఇన్నాళ్లకు ఆ ప్రక్రియ ముందుకు పడింది.
Also Read: 2 నెలల పాటు శుక్రుని సంచారం.. వీరికి డబ్బు, విలాసవంతమైన జీవితం సొంతం
పూరీ జగన్నాథ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర, స్వర్ణ, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం ఛాంబర్ లో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. 1978లో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారు. లెక్కగట్టలేకపోయారు. 1985లోనూ అదే జరిగింది. పూరీ రాజుకు లొంగిపోయిన రాజుల వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయంటారు.
కేరళలోని అనంతపద్మనాభ స్వామి అనంత సంపద గురించి, నేలమాళిగలు తెరవడం గురించి యావత్ ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠకు గురైంది. నాగబంధం వేసిన ఆరో గది చుట్టూ చిత్ర విచిత్రమైన ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు కూడా పూరీ జగన్నాథ ఆలయంలో రత్నబాండాగారం చుట్టూ అంతకు మించిన ఉత్కంఠ నెలకొంది. జులై 14న ఆ రహస్యగదిని తెరిచేందుకు అంతా సిద్ధమైంది. అందులో ఏముంది.. బయటికొచ్చేదెంత.. లోపల ఏమైనా ఉందా అన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. అసలే దైవిక సంపద. 12 శతాబ్దానికి చెందిన అతిపురాతన ఆలయమది. మరి అలాంటి ఆలయ సంపద బయటకు తీయడం అంటే చాలా రిస్కుతో కూడుకున్నదే.
ఆధునిక వాదులు ఎన్ని చెప్పినా సంప్రదాయాల ప్రకారమే ఇలాంటి దైవ నిధులను బయటకు తేవాల్సి ఉంటుంది. అసలే నాగ బంధం వేసిన తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లడం అంటే మాటలా..? గుండెలు అదిరిపోయే క్షణాలవి. చివరిసారిగా 1985లో వెళ్లిన వారు మాత్రం పాములేవీ కనిపించలేదని చెప్పుకొచ్చారు. అయితే రత్న భండార్లో విషపూరితమైన కింగ్ కోబ్రాల ఉనికి గురించి పూరీ జగన్నాధ ఆలయ సంపద గురించిన పురాణాలు, జానపద కథలెన్నో ఉన్నాయి. సో దేని లెక్క దానిదే.
Also Read: Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు!
పూరీ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆలయ పరిసరాల్లో పాములు కనిపించాయంటున్నారు అధికారులు. ఇది పురాతన ఆలయం కావడంతో, భూమి లోపల, పునాదుల దగ్గర చాలా చోట్ల చిన్న చిన్న రంధ్రాలు, పగుళ్లు గుర్తించారు. ఈ రంధ్రాల ద్వారా పాములు రత్నభండార్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకే రత్న భండార్ తెరిచే టైంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే పూరీ జగన్నాథుడి సంపదను బయటకు తెస్తామని స్వయంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చారు.
ఇప్పుడు అన్నట్లుగానే జులై 14న ముహూర్తం ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఒక టీమ్ ను రెడీ చేశారు. అందులో ఆర్కియాలజీ నిపుణులున్నారు. చిమ్మ చీకటి ఉండడంతో పవర్ ఫుల్ లేజర్ టార్చ్ లైట్స్ తీసుకెళ్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులున్నారు. ఆభరణాల విలువ లెక్కించే వారున్నారు.. పెద్ద పెద్ద పాములను సైతం అవలీలగా పట్టుకుని బంధించే పకడ్బందీ స్నేక్ క్యాచర్స్ ఉన్నారు. అన్ని రకాల మందులతో డాక్టర్లూ రెడీ అయ్యారు. అసలే రహస్యగది. గత 39 ఏళ్లుగా అటువైపు ఎవరూ వెళ్లలేదు.
Also Read: శని ప్రభావం.. వీరి తలరాతలు మారిపోయే టైం వచ్చేసింది.
ఎలాంటి వాయువులు ఉంటాయో తెలియదు. పైగా నిధి చుట్టూ అత్యంత భయంకరమైన విష సర్పాలు ఉన్నాయన్న అంచనా ఉంది. అందుకే పాము ఏదైనా అన్ని రకాల విషాలకు విరుడుగా యాంటీ వీనమ్, అలాగే పాలీ వీనమ్ సీరమ్, ఇతర ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్ తో డాక్టర్లు కూడా వెళ్తున్నారు. రత్న భండార్ ఇన్నర్ ఛాంబర్ తలుపులు డూప్లికేట్ కీ తో ఓపెన్ కాకపోతే తాళం బద్దలు కొట్టే వారూ వెళ్తున్నారు. సో వెళ్లడం పక్కా.. తాళం చెవి దొరక్కపోతే తాళంతో సహా తలుపులు బద్దలు కొట్టడం పక్కా అని డిసైడ్ అయ్యారు.
1978లో చివరిసారిగా పూర్తి స్థాయిలో రత్న భాండాగారం ఇన్నర్ చాంబర్ లోకి ఒక టీమ్ వెళ్లింది. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఐదు కర్రపెట్టెల్లో ఉంచినట్లు గుర్తించారు. కొందరైతే 15 వరకు చెక్క పెట్టెలు ఉన్నాయంటున్నారు. ఈ పెట్టెల చుట్టూ వస్త్రాలు చుట్టి ఉన్నాయి. పూర్వం అప్పుడప్పుడు దాన్ని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత అటువైపు ఎవరూ వెళ్లలేదు. ఏం జరిగిందో తెలియదు. తాళం కీ కనిపించకుండా పోయింది. 2018లో ఒరిజినల్ కీ లేదన్నారు. ఆ తర్వాత డూప్లికేట్ కీ దొరికిందని చెప్పారు. అంతా గందరగోళం.. ఇంకెంతో.. అనుమానాస్పదం.. కానీ అవన్నీ పటాపంచలయ్యే రోజు రానే వచ్చింది. సాక్షాత్ జగన్నాథుడి అనంత సంపద అశేష భక్తజనం చూసి తరించేలా బయటకు రాబోతోంది