TTD:వెంగమాంబ బాటలో ఎందరో భక్తులు శ్రీవారి సేవలో తరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తిరుపతిలో శ్రీవారి పరమ భక్తురాళ్లు కోమలమ్మ, పొన్నమ్మ, రేబాల సుబ్బమ్మ చాటిన భక్తి అనన్యమైంది.శ్రీవారికి పుష్పకైంకర్యాలు నిర్వహించాలని, తమ నివాస ప్రాంతంలో కొలువు తీర్పించాలని వారు తపించారు.
పొన్నమ్మ:
స్వామివారి ఆరాధనకు మించినది లేదని భావించేది. సువిశాల స్థలంలో పూల తోటలను పెంచి, అందులోని పుష్పాలను శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేది. కొన్నాళ్లకు తాను కాలు కదల్చలేని స్థితిలో పూలతోటలతో సహా తన స్థలాన్ని శ్రీవారి పుష్పకైంకర్యాల కోసం సమర్పించింది. ప్రతిఫలంగా ఆమె ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా తాను సమర్పించిన స్థలంలో శ్రీవారి క్రతువును నిర్వహించాలని వేడుకుంది. ప్రస్తుత టీటీడీ పరిపాలన భవనం ఎదురుగానే పొన్నమ్మ పూదోట ఉండేది. ఆ స్థలంలో గోవిందరాజస్వామి పాఠశాలతో పాటు, అదే ఆవరణలో టీటీడీ ఓ మండపాన్ని కూడా నిర్మించింది. ఈ మండపం పొన్నమ్మ మండపంగా గుర్తింపు పొందింది.
సుబ్బమ్మ:
తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక రోజంతా సీతారామలక్ష్మణ సమేత హనుమంతునికి రేబాల సుబ్బమ్మ తోటలోనే టీటీడీ కొలువు దీరుస్తోంది. రేబాల సుబ్బమ్మ విస్తారమైన స్థలంలో పూదోటలను పెంచుతూ, అందులోని పుష్పాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలకు సమర్పించేది. తన తర్వాత కూడా తను పూదోటల్లో శ్రీవారికి ఏడాదిలో ఓ రోజైనా కొలువు జరిపించాలని తపించేది. అందుకే స్థలాలతో పాటు పూలతోటల్ని దేవస్థానానికి కానుకగా సమర్పించింది.
కోమలమ్మ:
దట్టమైన చెట్లతో నిండిన కొండకు కాలిబాటన నడిచి వెళ్లాంటే భక్తులు భయపడాల్సి వచ్చేది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసేవారికి సమయానికి ఇంత అన్నం దొరికేది కాదు. కాస్త విశ్రాంతి కావాలన్నా ఇబ్బందిగా ఉండేది. శ్రీవారి భక్తులు పడుతున్న కష్టాలను చూసిన రాఘవశెట్టి భార్య కోమలమ్మ తపించిపోయారు. అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చిన వారి ఆకలి దప్పికలను తీర్చారు. ఆమె చివరి రోజుల్లో శ్రీవారిని తన ఇలాకాలో ఏడాదికి ఓసారైనా కొలువు దీర్చాలని వేడుకుంది. నిత్య పుష్పకైంకర్యాల కోసం తానే పుష్పాలను ఇవ్వాలని తపించింది. తాను అనుకున్నట్టే ప్రస్తుత తిరుపతిలో నడిబొడ్డునే ఉన్న విస్తారమైన స్థలాన్ని, అందులోని పూదోటలను, అన్నదాన సత్రాన్ని దేవస్థానానికి కానుకగా సమర్పించింది.