Nimishambika : కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో గంజాం నిమిషాదేవి ఆలయం ప్రత్యేకమైంది. ఒడియార్లనే రాజులు ఒకప్పుడు శ్రీరంగం పట్నంని రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు. అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది. ఆలయంలో ఈశ్వరుని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. భక్తులు నిమిషాంబ దేవికి గాజులు, దుస్తులను, నిమ్మకాయల దండల్ని సమర్పిస్తుంటారు నిమిషాంబ అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచుకుంటూ సర్వశుభాలూ జరుగుతాయని నమ్ముతారు.
నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పనే లేదు. తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట. నిమిషాంభ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి బలిభోజనం. రోజూ ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి, ఆలయంలోని గంటను మోగించగానే, ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్లిపోతాయి. ఇప్పటికీ ఈ వింతన మనం కళ్లారా చూడొచ్చు.
పూర్వం ముక్తకుడు అనే రుషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తూ శివుని అంశ. ఆ ముక్తక రుషి లోకకళ్యానార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది. యాగాన్ని చెడగొట్టేందుకు వాళ్లు చేయని ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు. అన్నీ ప్రయత్నాలు చేశారు. ఒక దశలో చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక రుషి వల్ల కాలేదు. దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి, రాక్షస సంహారాన్ని చేసిందట. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు. అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది.
నిమిషాంబ దేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా… ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ శివార్లలోని బోడుప్పల్లోని ఆలయం ప్రముఖమైనది.