Nanda Deepam:– రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని అతి పురాతనమైన సీతారామాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ పాలకుల కాలంలో దాదాపు క్రీస్తు శకం 1333లో నిర్మితమైన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గుడిలో అఖండ జ్యోతి 700 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఆలయంలో నందా దీపంను ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయంలో నిర్విఘ్నంగా పూజలు చేసిన ఆధారాలున్నాయి. ఈ నందా దీపం వెలుగుతుండడం వల్లే ఐశ్వర్యం, ధాన్యం, సమృద్ధిగా కలుగుతుందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతుంటారు. ఈ ఆలయాన్ని వారసత్వ సంపదగా కాపాడుకుంటున్నారు.
ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహలతోపాటు 16 రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం, గంట, తటాకం నాటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయంలోని గంటపై ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంవత్సరం చెక్కబడి ఉంది.ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల రాజ్యంలో కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రత్యేక గుర్తించేవారు. అలా గుర్తించిన వాటిలో గంభీరావుపేట ఒకటి. ఇదే మెయిన్ సెంటర్ గా ఉండేది. అందుకే అక్కడ ప్రత్యేకంగా లక్ష్మణ సమేత సీతారామాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు.
కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాప రుద్రుని కాలంలో ఈసీతారామాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. నిజాం హయాంలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వేంకటరావు దేశాయి సంస్థానాధీశుడిగా ఉండేవాడు. ఈ ఆలయం పరిపాలన ఆయన కిందకి రావడంతో సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానికులు చెబతుంటారు. ఆలయంలోని పూజ కార్యక్రమాల కోసం దగ్గర్లోనే వెంకటాద్రి చెరువును నిర్మించారు. ఆ చెరువు నుంచే ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటికీ నీటిని తెస్తుంటారు. ఇప్పటికీ ఆచారం కొనసాగుతోంది.