Namaz:- ఇస్లామ్ సౌధానికి మూలస్తంభం నమాజ్. ధార్మిక విశ్వాసాల్లో విధిగా చేపట్టే ఆరాధన. పరలోకాన్ని విశ్వసించేవారు రోజూ ఐదు పూటలా నమాజ్ చేయాలన్నది అల్లాహ్ ఆజ్ఞ. లోకంలో ఎన్నో సమస్యలతో సతమతమయ్యే ఈ మానవునికి ఎవరితోనైనా తన సమస్యలను చెప్పుకోవాలని ఉంటుంది ఆ సమస్యలను విన్నవించుకోవటానికి ఆ భగవంతుడి కన్నా ఉత్తములు నమాజు కన్నా మంచి మార్గం ఎముంటుంది? నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ అంటే సంకల్పం తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి.
అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.ఈ నమాజులను నిర్ణీత వేళల్లో, నిర్దేశించిన రీతుల ప్రకారమే చేయాలి. భక్తితో, అణకువతో చేసే ప్రార్థన చెడునుంచి కాపాడుతూ మనోవాంఛల్ని అదుపులో ఉంచుతుంది. స్నానం తర్వాత మలినం ఉండనట్లే నమాజు చేసేవారిలో చెడు ఉండదు. ఐదు పూటలు చేయడం వల్ల మాటిమాటికీ దైవాజ్ఞలను గుర్తుచేస్తాయి. నమాజులో పఠించే ఖురాన్ సూక్తుల్ని ఆచరణలో పెట్టాలన్నది అసలు ఉద్దేశం.
నమాజ్ నా కంటి చలువ అన్నారు ప్రవక్త . మస్జిదుకు వెళ్లి నమాజు చేయడం తప్పనిసరి. సామూహిక నమాజు 27రెట్ల పుణ్యం లభిస్తుందన్నది ముస్లిముల నమ్మకం. అజాన్ వినగానే తాత్సారం చేయక వెళ్లాలి. నమాజు చేసే వేళలను బట్టి తెల్లవారుజామున ఫజర్, మధ్యాహ్నం జొహర్, సాయంత్రం 4-5గంటల మధ్య అసర్, సూర్యాస్తమయం తరువాత మగ్రిబ్, రాత్రి నమాజును ‘ఇషా’ అని అంటారు. రాత్రి ఇషా, ఉదయం ఫజర్ నమాజు చేసినవారికి రాత్రంతా దైవారాధన చేసినంత ఫలితమని ప్రవక్త ప్రవచనం.
నమాజుకు దేహశుద్ధి ముఖ్యమని కాళ్లూ, చేతులు, ముఖం, నోరు కడుక్కోవడాన్ని ఉజూ అంటారు. శుక్రవారాన్ని పండుగలా భావించి విధిగా మసీదు వెళ్తారు. ఆరోజు జొహర్కు బదులుగా జుమా నమాజు చేస్తారు. తలంటు, అత్తరు పరిమళాలు, కళ్లకు సుర్మా ప్రవక్త సంప్రదాయం. మస్జిదులో ఇమాములు సమకాలీన అంశాలపై ఖురాన్ సూక్తులను జోడించి ప్రసంగాలు చేస్తారు.