Dhari Devi Temple : ఉత్తరాఖండ్లోని అలకనందా నది మధ్యన ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ఉదయం పూట బాలికగా, మధ్యాహ్నం నడి వయస్కురాలిగా, సాయంత్రం వృద్ధురాలి రూపంలోకి మారుతూ భక్తులకి తన ఉనికి ప్రత్యక్షంగా చూపిస్తుంది. ఇప్పటికి అమ్మవారు వివిధ రూపాల్లో తిరుగుతుందట. ఈ ఆలయం 8వ శతాబ్దం నాటిదని చరిత్ర చెబుతోంది. సైన్సుకు కూడా అందని రహస్యాలు దాగి ఉన్న ఆలయాల్లో ఇది ఒకటని చెప్పాలి.
అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ ధారీదేవి కంట్రోల్ చేస్తుందని స్థానికుల విశ్వాసం. ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయ ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది. . 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు. సిద్ద పీఠం పేరుతో అమ్మవారి ప్రస్తావన ఉంది. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళికి మరో రూపమే ధారీదేవి.
ధారీ దేవి కరుణ ఉంటే పగలు కూడా వెన్నెలగా మారుతుంది. అందుకే ఈ శక్తిని.. భక్తితో కొలిచిన వారికి ఎంతో మేలు జరుగుతుందని.. కోపం వస్తే ప్రళయమే అని స్థానికులు గట్టిగా నమ్ముతుంటారు. ఆ ప్రళయాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదంటారు. బద్రీనాథ్ నుంచి శ్రీనగర్ కి వెళ్లేదారిలో ఉన్న ఈ ధారీదేవి ఆలయం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
చార్ దామ్ క్షేత్రాలకు రక్షకురాలు ధారీదేవిగా చెబుతారు. అలకనందా నది మధ్యలో అమ్మవారి ఆలయం ఉంది. అందమైన చల్లని మంచుపర్వతాల మధ్య ఈ ఆలయం కొలువుతీరింది. ఆలయానికి పైకప్పు ఉండకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది. ఎంతోమంది ఎన్నో సార్లు పైకప్పు వేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. చుట్టూ నిర్మాణాలు జరిగినా అమ్మవారి విగ్రహంపై మాత్రం ఎలాంటి నిర్మాణం చేయలేదు. క్రీ.శ. 1882లో ఒక రాజు కేదార్ నాథ్ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూడగా…కొండ చరియలు విరిగిపడి భారీ నష్టం జరిగింది. ఆస్తి నష్టంతోపాటు ప్రాణనష్టం జరిగింది. ఇదంతా కళ్లారా చూసిన ఆ రాజు వెంటనే తన ప్రయత్నం విరమించుకున్నాడు. 2013లో వచ్చిన వరద బీభత్సానికి కూడా అమ్మ ఆగ్రహమే కారణమని భక్తుల నమ్మకం.