Panchabhakshya-Paramannalu : విందు భోజనం గురించి వివరించడానికి మనం తరచుగా పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించారు అని చెబుతుంటాం. మరి.. ఈ పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి….? అందులో ఎలాంటి వంటకాలు ఉంటాయో తెలుసుకుందాం.
దీనిపేరుకు తగ్గట్టే పంచభక్ష్య పరమాన్నాలు అంటే 5 రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అవి భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము మరియు పానీయము.
భక్ష్యం: ఒక్కొక్కటీ చేత్తో పట్టుకుని.. కొరికి తినే పదార్థాలను భక్ష్యాలు అంటారు. ఉదాహరణకు గారెలు, బూరెలు, కుడుములు, లడ్డూలు, వడలు, బజ్జిలు ఇలాంటివి.
భోజ్యం: బాగా నమిలి, చప్పరిస్తూ తినేవి. వీటిని మరో పదార్థంతో కలిపి తింటారు. ఉదాహరణకు అన్నం, చిత్రాన్నం, పులిహోరా, పూరీలు వంటివి. వీటని రసం, చట్నీలు, కూరలతో కలిపి తినాలి. ఇవి జీర్ణరసాన్ని వృద్ధి చేసి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
చోష్యం: జుర్రుకొని తినే ఆహారపదార్థాలను చోష్యం అంటారు. వీటిలో ముఖ్యంగా పండ్లు ఉంటాయి. ఉదాహరణకు పాయసం, చారు, మామిడిపండు రసం వంటివి.
లేహ్యం: నాకి తినే ఆహారపదార్థాలను లేహ్యం అంటారు. ఉదాహరణకు ఉరగాయలు, పరమాన్నం, తేనె, బెల్లం పాకం వంటివి. ఇవి నోటిలో లాలాజలాన్ని పెంచుతాయి.
పానీయాలు: తాగేవన్నీ పానీయాలు. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు లాంటివి. ఇవి ముందుతిన్నవాటిని చక్కగా కలిసేలా చేసి, జీర్ణంచేసేందుకు ఉపయోగపడతాయి.
చదవగానే నోరూరుతోంది కదూ… మరి మీరూ వచ్చే పండుగకు మీ ఇంటిలో వీటిని చేసుకుని హాయిగా తిని ఆనందించండి మరి..!