Margashira Naga Panchami : మార్గశిర మాసంలో అయిదవ రోజైన పంచమిని నాగ పంచమిగా కొన్ని ప్రాంతాల్లో జరపుకునే సంప్రదాయం అనాదిగా ఉంది. ఈ రోజున నాగులను పూజిస్తే కాలసర్ప, నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నాగ పంచమి రోజునే బ్రహ్మదేవుడు, ఆదిశేషుని అనుగ్రహించాడనే పురాణ గాథలూ ఉన్నాయి.
ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. స్నానాదికాలు పూర్తి చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించి, శివాలయంలో స్వామిని దర్శించుకోవాలి. అనంతరం నాగదేవతలను ఆవుపాలతో, తేనెతో అభిషేకించి, చలిమిడి, పాలను నివేదించి హారతి ఇచ్చి పూజ ముగించాలి. నాగ పంచమి రోజున పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం స్నానం చేసి నాగ దేవతలకు గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని నైవేద్యాన్ని సమర్పించి.. పూజానంతరం ఉపవాసాన్ని విరమించాలి. దీనివల్ల సంతాన సమస్యలు, సర్పదోషాలు, రాహు కేతు ప్రభావాలు తొలగిపోతాయి.
ఈ రోజున శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు హాజరయ్యేందుకు వేలాది మంది ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తుతారు. అలాగే.. ఈ రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేస్తే.. సకల కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. అలాగే.. కేరళలోని అనంత పద్మనాభ స్వామికి నేడు ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహిస్తారు. రుణ బాధలున్న వారు స్వామి సేవకు అవసరమైన ద్రవ్యాలను సమకూర్చితే.. స్వామి కటాక్షంతో ధన వృద్ధి కలుగుతుందని విశ్వాసం.
పవిత్రమైన మార్గశిర పంచమి రోజున వారాహి దేవిని నియమనిష్ఠలతో పూజించిన వారికి ఆ దేవి అనుగ్రహం లభించి, వారు అష్టైశ్వర్యాలు పొందగలరని పురాణ వచనం. అలాగే.. ఈ వారాహీ మాత దయ ఉన్నవారిని గ్రహదోషాలు కూడా ఏమీ చేయలేవు. ఈ మార్గశిర పంచమి సాయంత్రం వేళ.. వారాహి దేవి ఎదుట పంచముఖ నేతి దీపాన్ని వెలిగిస్తే.. ఆ తల్లి అనుగ్రహం సదా తమపై ఉంటుందని భక్తుల విశ్వాసం.