Mahalaya Amavasya: ఎంతో దానశీలిగా పేరుప్రతిష్టలు సంపాదించిన కర్ణుడు మరణించిన తరువాత స్వర్గలోకానికి బయలుదేరాడు. మార్గమధ్యలో తీవ్రమైన ఆకలి, దాహం వేసింది. వెంటనే అక్కడ కనిపించిన చెట్టుకున్న పండు కోసి తినబోయాడు. అయితే.. అది బంగారు ఫలంగా మారింది. మరో చెట్టు పండ్లు కోసినా.. అవీ అలాగే మారిపోయాయి. సరే.. కనీసం దప్పికైనా తీర్చుకందామని సెలయేటి నీరు దోసిలి పట్టి తాగబోగా అవీ స్వర్ణజలంగా మారిపోయాయి. స్వర్గంలోనూ ఇదే పరిస్థితి.
జీవితమంతా దానధర్మాలతో కాలం గడిపిన తనకు ఇలాంటి అనుభవం ఎదురుకావటంతో కర్ణుడికి ఆశ్చర్యంతో బాటు ‘నా పుణ్యనికి ఇదేనా ఫలం’ అనే రవ్వంత నిరాశ కూడా కలిగింది.
అప్పుడే అశరీరవాణి వినిపించి.. ‘కర్ణా! నీవు దానశీలివే. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ వెండి, బంగారం రూపంలోనే చేశావు గానీ… ఎవరికీ పిలిచి నీ చేత్తో పట్టెడన్నం పెట్టలేదు. అందుకే నీకు ఈ దుస్థితి’ అని పలికింది.
వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్లి.. దీనికి పరిష్కార మార్గం ఏమిటని అడగగా, అక్కడే ఉన్న దేవతలకు రాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అరుదైన అవకాశం ఇచ్చాడు.
‘నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులకు అన్నం పెట్టి.. నిన్ను పెంచిన తల్లిదండ్రులకు తిలోదకాలు వదిలి రా’ అన్నాడు.
దీంతో కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకానికి చేరుకొని 15 రోజుల పాటు రోజూ పేదలు, బంధుమిత్రులకు అన్న సంతర్పణ చేసి.. పెద్దలకు తర్పణాలు వదిలి.. తిరిగి అమావాస్య రోజు స్వర్గానికి వెళ్ళాడు.
చిత్రంగా ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణ, పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు ఆకలిదప్పులు లేకుండా పోయాయి.
అలా.. కర్ణుడు ఈ భూమ్మీద గడిపిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలనీ, ఆయన స్వర్గానికి తిరిగెళ్లిన రోజును మహాలయ అమావాస్య అంటారు.
బ్రహ్మ పురాణం ప్రకారం ఈ మహాలయ పక్షము రోజులలో యమధర్మరాజు తనలోకములో ఉన్న ఆత్మలకు.. వారి వారసుల నుంచి ఆహారం తీసుకునే స్వేచ్ఛ ఇస్తాడట. అందుకే ఈ 15 రోజుల్లో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు.
ఎవరైతే ఇలా చేయరో.. వారు పితృదోషమును ఎదుర్కొంటారనీ, పితృకర్మను ఆచరించిన వారిని వారి పూర్వీకులు సంతోషంగా ఆశీర్వదిస్తారని నిర్ణయ సింధు వంటి గ్రంథాలు చెబుతున్నాయి.
ఈ మహాలయ పక్షాలలో శ్రాద్ధకర్మ నిర్వహించలేని వారు కనీసం.. ఈ మహాలయ అమావాస్య నాడైనా దీనిని ఆచరిస్తే.. పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది.
చనిపోయిన వారి తేదీ తెలియని వారు, తెలిసిన, గతించిన బంధువుల వివరాలు తెలియని వారు కూడా ఈ రోజు వారికి శ్రాద్ధ కర్మ చేయవచ్చును.
ఆర్థిక వనరులు లేక, పేదరికంలో ఉండి.. ఈ కర్మలు నిర్వహించలేని వారు గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అదీచేయలేని వారు మహాలయ అమావాస్య రోజు.. నిర్జన ప్రదేశంలో మిట్టమధ్యాహ్నం.. నిలబడి, రెండు చేతులూ ఎత్తి ఆకాశం వైపు చూసి పితృదేవతలను తలచుకుని, నమస్కరించినా వారికి మోక్షం సిద్ధిస్తుంది. అదీచేయలేని వాడు.. చెట్టును హత్తుకుని పెద్దలను తలచుకుని రెండు కన్నీటి బొట్లు కార్చినా.. పెద్దలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది.