Maha Shivratri in Telugu States : తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ఉన్న ఆలయాలన్నీ శివరాత్రి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే.. పరమశివుడికి రుద్రాభిషేకాలు చేస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్థరాత్రి తర్వాతి నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆ లయకారుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇక శ్రీశైలంలోనూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
తెలంగాణలో వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. వరంగల్ వేయిస్తంభాల ఆలయంలో పునర్నిర్మాణం చేసిన కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించి, కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. సిద్ధేశ్వరాలయం, కురవి శ్రీ వీరభద్రేశ్వరుడి ఆలయం, మల్లికార్జునస్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కాళేశ్వర ముక్తీశ్వరాలయాలు శివనామస్మరణతో మారు మ్రోగుతున్నాయి. భక్తులు గోదావరి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారికి మారేడు దళాలను సమర్పించి.. తమ కోరికలు తీర్చాలని మొక్కుకుంటున్నారు.
Read More : జ్యోతిర్మయ స్వరూపుడు… పరమ శివుడు..!
పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ ఆలయానికి సైతం భక్తులు తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే తిరనాళ్లు చాలా ప్రత్యేకం. వేకువ జాము నుంచి జాగరణ పూర్తయ్యేంతవరకూ భక్తుల సందడి ఉంటుంది. ఆలయానికి ఎదురుగా పోటాపోటీగా ప్రభలు కడుతారు. విజయవాడ రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాల్లోనూ ఈ ప్రభల సాంప్రదాయం ఉంది. విశాఖలో మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాలను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా భక్తులు.. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నారు. కాశీ విశ్వనాథుని దర్శనార్థం.. భక్తులు బారులుతీరారు. మరోవైపు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళ్ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శైవక్షేత్రాల్లో శివపార్వతుల కల్యాణంతో పాటు.. జాగరణ చేసే భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.