Lord Shiva : తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అని ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం కర్నూలు జిల్లాలోని ఈ సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండే సంగమేశ్వర ఆలయం.. కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఏడు నదులు కలిసే ప్రదేశం కాబట్టి ఈ ఆలయానికి సప్తనది సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏ శివాలయానికి వెళ్లిన శివలింగం రాతితో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం శివలింగం వేప కొమ్మతో ఉంటుంది. పాండవులు వనవాసంలో పూజలు చేసుకోవడానికి వేప చెట్టు కొమ్మను ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేసినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ వేప శివలింగం ఇక్కడ అలాగే ఉంది.
ఈ సంగమేశ్వర ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ సంగమేశ్వర ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ చేయవలసిన సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు ధర్మరాజు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.