Lord Shiva : భక్తిని , ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. అన్నిటికంటే శివరాత్రి వత్రం గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. శివలింగం ఉన్న చోటికి వెళ్ళి పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం , లోపల , బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. ఉత్తమమైన పూజారి సమక్షంలో ఈవత్రాన్ని ఆచరించాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.
శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ 4 జాములలో చేయాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు , శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం , ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.చందనం , బియ్యం , నల్లని నువ్వులతో పూజించాలి. పద్మం, ఎర్రగన్నేరు వంటి పువ్వులతో అర్చించాలి. భవుడు , శర్వుడు , రుద్రుడు , పశుపతి , ఉగ్రుడు , మహాన్ , భీముడు , ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం , కొబ్బరి , తాంబూలాలను నివేదించాలి.
అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు , యవలు , కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను , అప్పాలను నివేదించాలి.
కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పెసలు మినుములు , లాంటి ధాన్యాలను , శంఖ పుష్పాలకు , మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ , మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి.ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది