Decides Marriages:కర్ణాటకలోని ఇడగుంజి వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంది. కోరిన కోరికలు తీర్చే దేవుళ్లు, ఆలయాలు మనకు తెలుసు. కాని ఇక్కడ వినాయకుడు పెళ్లి సంబంధాలను కుదురుస్తుంటాడు. ఈ గణేశుడిఅనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలు ఆ ఊరి జనం కూడా చేయరు. బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లు మొదలుపెడతారు. ఒకవేళ అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ పడితే అశుభంగా భావించి ఆగిపోతారు. మరో పెళ్లి సంబంధాన్ని చూసుకుంటారు.
మనదేశంలో పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో, ఇడగుంజి ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్నాటకలోనే పుట్టి, ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది, హోన్నవర్ వద్దనే అరేబియా సముద్రంలోసంగమిస్తుంది. స్థలపురాణం అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం.శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు రుషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. త్రిమూర్తులు ఈ ప్రాంతంలోనే అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని రుషులు నిర్ణయించుకున్నారు.
కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో రుషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే, ఎటువంటి విఘ్నాలూ లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. స్వయంగా తానే కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తీసుకొచ్చాడు. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. రుషు భక్తికి మెచ్చిన గణేశుడు, ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి.
ఇడగుంజిలో మూలవిరాటు ఒక చేతితో మోదకాన్నీ, మరో చేతితో కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని పాదాల చెంత ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం.