Kedareswara Vratham : కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి.
ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం.
పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
కార్తీక మాసములో సోమవారాల్లో ముఖ్యముగా మూడవ సోమవారము, ఉదయం నుండి ఉపవాసము ఉండి సాయంత్రము పరమేశ్వరుణ్ణి ఫల, పుష్ప పత్రితో పూజించాలి. స్వామికి బూరెలు నైవేద్యం పెట్టాలి. ఈ బూరేలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి. పున్నమి చంద్రుడిని చూచి ఆహారం తీసుకోవాలి. తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి కూడా భద్రపరచాలి. ఈ నోమును కోడళ్ళకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా
చేసుకోవడం మంచి సాంప్రదాయం.