తమిళనాడులోని చెంగల్పట్టులోని పక్షితీర్థంలో జరిగే వింత కళ్లారా చూడాలి. ఇక్కడ కొండపైకి ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి. యాత్రికులు ఉదయాన్నే పక్షితీర్థంలో స్నానం చేసి కొండ ఎక్కి స్వామికి పండ్లు, పూలు, కర్పూరం మొదలైనవి సమర్పిస్తారు. దేవాలయ పరివారం ఈ విరాళాలను స్వీకరించి చక్కెర పొంగలి, నేయి పాత్రలను స్వామికి సమర్పించి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారు. తరువాత పూజారులు ఒక పక్క, భక్తులు ఒక పక్క కూర్చుని ఉంటే ఆకాశ మార్గాన రెండు పక్షులు వచ్చి చక్కెర పొంగలి తిని నేతిని తాగేసి పోతుంటాయి. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.
ఈ పక్షులు కాశీ, రామేశ్వరం యాత్ర చేస్తూ, మధ్యలో పూజారి ఇచ్చిన పరమాన్నం రుచిచూసిన ప్రాంతంలో ఆగుతాయని అక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం “పక్షితీర్థం”గా స్థిరపడింది ప్రసిద్ధిగాంచింది. ఈ పక్షితీర్థం వెనుక ఒక పురాణ గాధ కూడా ఉంది.
కృత యుగములో ఒకసారి సర్వ సంగ పరిత్యాగులైన 8 మంది మహామునులకు ప్రపంచ భోగములను అనుభవించాలన్న కోరికతో తపస్సు చేశారు. పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారు నిజము చెప్పడానికి తటపటాయిస్తూ మాకు మీ సేవయే కావాలన్నారు. కానీ శివుడు వారి మనసులందు కోరిక గమనించి 8మందినీ ఎనిమిది పక్షులై
జన్మించాలని ఆదేశించాడు.
ఒక్కొక్క యుగము నందు ఇద్దరు రెండు పక్షుల చొప్పున ప్రతి రోజూ గంగా స్నానము ఆచరించి తన ప్రసాదాన్ని తినిపోతూ ఉండమన్నాడు. ఆ తరువాత జన్మలో మోక్షం పొందుతారని వరమిచ్చాడు. అలా శివుడు ఆజ్ఞతో త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులనే పక్షులయ్యాయి. కలియుగమున శంబర శంబరాదులనే పక్షులై ప్రతి దినము గంగాస్నానము చేసి ఈ కొండపైకి వచ్చి పోతుంటారని స్థల పురాణం చెబుతోంది.