Ashta Siddulu : పరమాత్మను విశేషంగా ఆరాధించిన భక్తులకు అష్ట సిద్ధులు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలలో, శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాల్లో అపారమైన ఉపాసానా బలంతో వీటిని సాధించిన యోగులు నేటికీ ఉన్నారని పెద్దలు చెబుతారు. ఈ 8 రకాల శక్తులను పొందినవారు.. వాటిని స్వప్రయోజనాలకు, గొప్పలకు పోయిగానీ వాటిని ప్రదర్శించటాన్ని మన శాస్త్రాలు నిషేధించాయి. ఆ ఎనిమిది రకాల సిద్ధులు, వాటి వివరాలు..
అణిమ : సాధారణ రూపం కంటే చిన్న శరీరాన్ని దాల్చటమే అణిమ. అంటే ఈ శక్తిని పొందిన యోగులు.. తమ శరీరాన్ని అణువు సైజులోకి మార్చుకోగలరు. అవసరాన్ని బట్టి వీరు చీమ, దోమ వంటి అల్ప ప్రాణుల్లోకి ప్రవేశిస్తారు. భగవంతుడు అన్నింటా ఉన్నాడనే నమ్మకంతో ఆయనను ఆరాధించి, ఆయన యందు మనసు నిలిపిన వారికి ఈ శక్తి సిద్దిస్తుంది. దీనిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్నరూపాన్ని దరించి ప్రదర్శించాడు .
మహిమ : సహజ రూపం కంటే చాలా పెద్ద రూపాన్ని పొందటమే మహిమ. రామాయణంలో ఆంజనేయుడు సముద్రాన్ని దాటే సమయంలో సురస నోరు తెరిచినపుడు తన శరీరాన్ని భూమండలం అంత పెద్దదిగా చేసి ఈ మహిమా శక్తిని ప్రదర్శిస్తాడు. అలాగే ఇక వామనావతారంలో విష్ణువు కూడా మూడడుగులతో భూమ్యాకాశాలను ఆవరిస్తాడు.
లఘిమ : తన శరీరాన్ని దూది కంటే తేలికగా మార్చుకోగలటమే లఘిమ. ఈ సిద్ధి కలిగిన యోగులు.. నీటిమీద, ఆకాశంలోనూ అనాయాసంగా ప్రయాణిస్తారు.
గరిమ : సహజ రూపం కంటే భారీ బరువైన రూపాన్ని ధరించటమే గరిమ. ఈ సిద్దిని పొందిన వారు తమ శరీరపు బరువును భూమి భారానికి సమానంగా పెంచగలుగుతారు. భాగవతంలో బాలుడైన శ్రీకృష్ణుడు.. తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారి, ఆ రాక్షసుడికి గాలి ఆడకుండా చేసి చంపుతాడు. అలాగే.. భారతంలో భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మారుస్తాడు.
ప్రాప్తి : కోరిన ప్రతిదానినీ సృష్టించగలగటమే ప్రాప్తి. ఈ సిద్ధిని పొందిన వారు తాము కోరిన వస్తువును అలవోకగా గాలిలో సృష్టించగలరు. అంతేకాదు.. మనసులో వారేదైనా కొత్త ప్రాంతానికి పోవాలని భావించిన వెంటనే కోరిన రూపంలో అక్కడికి చేరుకుంటారు.
ప్రాకామ్యము : కోరిన దానిని మరుక్షణంలో పొందటమే ప్రాకామ్యము. ఈ సిద్ది పొందిన వారికి దూరంగా జరిగేవాటిని నేరుగా చూడగల శక్తి, దూరంగా వినిపించే మాటలు స్పష్టంగా వినిపించటం, ఆకాశంలో ప్రయాణించే శక్తి వంటి దివ్య శక్తులు ఉంటాయి. అలాగే.. వారు తమ శరీరాన్ని వదిలి యవ్వన శరీరమును కోరినంత కాలం పొందగలరు.
వశిత్వము : విషయ భోగాల నుంచి ముక్తిని పొందటంతో బాటు పంచ భూతాలపై నియంత్రణను సాధించటమే వశిత్వము. ఈ సిద్దిని పొందిన వారు సమస్త జంతువులను, సర్పములు మచ్చిక చేసుకోగలరు.
ఈశిత్వము : కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనే వాటిని జయించి ఎలాంటి తాపత్రయాలు లేనివాడైన యోగి, జితేంద్రియుడిగా, భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరునికి సమాన స్థితిని, శక్తిని పొందుతాడు. ఈ స్థితిలో సాధకుడు దిక్పాలకులనూ నియంత్రించే శక్తిని పొందుతాడు.
శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు . తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు. కానీ.. మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.
వీటిలో ఒక్క సిద్ధిని పొందేందుకు సాధకుడు 40 ఏళ్లు కష్టపడాల్సి ఉంటుందని చెబుతారు. ఇందుకు రుజువుగా ఆది శంకరుల ఉదంతాన్ని చెబుతారు. ఒకసారి ఆది శంకరుడికి ఒక సిద్ధుడు తారసపడి, తనకున్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు తనకు 40 ఏళ్లు పట్టిందని చెప్పగా, ‘ అయ్యో.. పిచ్చివాడా, ఎందుకంత సమయం వృధా చేశావు? ఒక మంచి మనిషిని దూషించినా, నువ్వు మరుజన్మలో కాకిగా పుట్టి ఆకాశంలో తిరిగేవాడివిగా’ అని ఎద్దేవా చేసినట్టు చెబుతారు. సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితంలో అంతకాలం వృధా చేయకుండా భగవన్నామస్మరణవల్ల ఉత్తమగతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.