Andhra Pradesh: శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్ని వర్ణనలున్నా.. ఎక్కడా ఆయనకు మీసాలున్నట్లు సాహిత్యంలో కనిపించదు. కానీ.. ఆ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయం మన తెలుగునేలపై ఉంది.
అంతేకాదు.. ఈ గుడిలో స్వామిని దర్శించుకొని, ప్రార్థించే ప్రేమికులకు తప్పక పెళ్లవుతుందనే బలమైన విశ్వాసమూ జనావళిలో ఉంది.
ఇంతటి విశిష్టత గల ఆ మీసాల వేణుగోపాల స్వామి ఆలయం నేటి కోనసీమ జిల్లాలోని పులిదిండి గ్రామంలో ఉంది.
పూతరేకులకు పేరుగాంచిన ఆత్రేయపురానికి సుమారు 7 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడే అఖండ గోదావరి.. వశిష్ట, గౌతమి నదులుగా విడిపోతుంది.
పచ్చని పంటపొలాలు, అలరించే ప్రకృతి మధ్య పొందికగా ఉండే పులిదిండి గ్రామంలో ఈ మీసాల వేణుగోపాలుడు కొలువై ఉంటాడు.
300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో వేణుగోపాలుడు.. కుడిచేత శంఖాన్ని, ఎడమచేత చక్రాన్ని ధరించి దర్శనమిస్తాడు.
సాధారణంగా విష్ణువు కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో శంఖం ఉంటాయి. కానీ.. ఇక్కడ అందుకు భిన్నమైన నల్లరాతి మూర్తిగా స్వామి దర్శనమిస్తాడు.
వివాహం కావాలని కోరుకునే వారు ఈ కన్నయ్యను కోరుకుంటే తప్పక జరుగుతుందని ప్రతీతి.