Hanuman Chalisa : రామభక్తుడైన ఆంజనేయుడు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడతాడని సుందరకాండ మనకు చెబుతోంది. స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో స్వామివారిని ప్రతి మంగళ వారం లేదా స్వామి వారి జన్మించిన శనివారం ఉదయం లేదా సాయంత్రం 3 సార్లు తూర్పు ముఖంగా కూర్చుని పారాయణ చేసి, స్వామికి బాగా పండిన తియ్యని అరటి పండ్లు లేదా శనగపిండితో చేసిన తీపి బూందీని నివేదన చేస్తే.. ఆంజనేయుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఏమీ నివేదించలేని వారు.. స్వామికి తమ అశక్తతను మనసులోనే చెప్పుకుని హనుమాన్ చాలీసా పారాయణము చేసినా.. స్వామి అదే ఫలితాన్నిస్తాడు.
మానసిక రుగ్మతల కారణంగా బుద్ధి వికాసం లేని, గ్రహణ శక్తి తక్కువగా ఉన్న పిల్లల చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయిస్తే.. ఆ పిల్లలకు ఉన్న దోషాలు తొలగిపోయి.. వారు ఇతర పిల్లల మాదిరిగా చురుగ్గా మారతారు. ఇంట్లోని వారికి అకారణంగా భయాలు, మానసిక ఆందోళనలున్నా, ప్రతికూల ప్రతిస్థితులు ఎదురవుతున్నా.. హనుమాన్ చాలీసా పారాయణం చేత ఈ సమస్యలు తొలగిపోతాయి.
శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవారు, తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల పాలయ్యేవారు రోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభిస్తుంది. జాతకంలో ఏలినాటి శని ప్రభావం నడుస్తున్న వారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే.. శని కారక ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ అంతగా బాధించవు. మృగశిరా నక్షత్రం ఉన్న రోజునే ఆంజనేయుడు తొలిసారి.. సీతమ్మ దర్శనం చేశారు. కనుక ఆ నక్షత్రమంటే ఆయనకి ఇష్టం. కనుక ఈ నక్షత్రరోజున 108 సార్లు చాలీసాపారాయణం చేస్తే.. తీవ్ర వ్యాధులు నిదానిస్తాయి.
తరచూ వాహన ప్రమాదాలకు లోనవుతున్నవారు, జాతకంలో గండదోషాలున్నవారు, మంచి శారీరక బలం కోరుకునే వారు రోజూ హనుమాన్ చాలీసా చదవటం వల్ల సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులున్న వారు 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక.. చాలీసా పాటించే రోజుల్లో తప్పక బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నేల మీద రాత్రి పూట పడుకుంటే మరింత ఎక్కువ ఫలితం పొందవచ్చు. ఎక్కడ రామనామం, రామభజన జరుగుతుందో.. అక్కడ ఆంజనేయ స్వామి కళ్లవెంట ఆనంద భాష్పాలు కారుస్తూ, రామభజనను ఆర్తిగా వింటాడు. కనుక చాలీసా పారాయణకు ముందు, తర్వాత రామనామ జపం చేయాలి.