Quran:- లోకానికి ఖురాన్ వెలుగు వచ్చిన పవిత్ర నెలను ముస్లింలు అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకొంటారు. కఠోర ఉపవాసాలు పాటించి, ఖురాన్ పారాయణం చేస్తారు. ఇది అల్లాహ్ను స్మరించే గొప్ప మార్గం.
ఈ పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నంత సేపు అల్లాహ్ తనతో మాట్లాడుతున్నాడు అనే భావన కలిగి ఉండాలి. చదివిన వాక్యాలను మనసులో నింపుకొన్నప్పుడే జీవితంలో మార్పుకు అడుగులు పడతాయి. ఖురాన్లో అల్లాహ్ అనుగ్రహాల ప్రస్తావన వచ్చినప్పుడు, ప్రవక్తల గాథలు విన్నప్పుడు వారిని అనుసరించాలనే ప్రేరణ కలగాలి. దుర్మార్గులు, అత్యాచారుల గురించి చదివినప్పుడు వారిపట్ల విద్వేషం కలగాలి. పరలోకం, స్వర్గ, నరకాలు, ప్రళయం గురించి చదివినప్పుడు స్వర్గాన్ని సాధించాలన్న తపన కలగాలి
నరకాగ్ని శిక్షలను చదివేటప్పుడు హృదయం కంపించిపోవాలి. అలాంటి శిక్షల నుంచి కాపాడమని దైవాన్ని వేడుకోవాలి. ఖుర్ఆన్ ను సుమధురంగా చదవాలి’ అంటారు ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త రోజంతా దైనందిన వ్యవహారాల్లో లీనమై ఉన్నప్పటికీ ఖురాన్ పారాయణానికి రాత్రిని అనువైన సమయంగా భావించేవారు. సుదీర్ఘ సమయం నమాజులో నిలబడి ఖురాన్ పారాయణం చేసేవారు.
ఈ పవిత్ర గ్రంథాన్ని చదివే ముందు కారుణ్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించమని అల్లాహ్ను వేడుకోవాలి. ఖురాన్ వాక్యాలు అత్యంత శ్రద్ధతో వినాలని అల్లాహ్ సూచిస్తాడు. ఇందులోని ఒక్క వాక్యం విన్నా.. రెట్టింపు పుణ్యాలు లభిస్తాయి. అలాంటివారికి ప్రళయం రోజున ఖురాన్ దారి చూపి కాపాడుతుంది. ఖురాన్ పఠనాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. పలు సందర్భాల్లో ప్రవక్త ఖురాన్లోని కొన్ని ప్రత్యేక వాక్యాలను పఠించేవారు. దానివల్ల అల్లాహ్ రక్షణ వెన్నంటి ఉంటుందన్నది ప్రవక్త ఉద్బోధ. నిద్రకు ఉపక్రమించే ముందు రెండో అధ్యాయంలోని ఆయతుల్ కుర్సీ వాక్యాలను తప్పకుండా పఠించేవారు.
ఈ వాక్యాలు పఠించినవారి వెంట రాత్రంతా ఒక దైవదూత రక్షణగా ఉంటాడని ప్రవక్త చెప్పారు. దుష్పరిణామాల సమయంలో సూరె ఫలఖ్, సూరె నాస్ అని పఠించే వారు . అనారోగ్యానికి గురైనప్పుడు ఖురాన్ మొదటి అధ్యాయం ‘సూరె ఫాతిహా’ చదివి స్వస్థత పొందేవారు.