Plants:ఇల్లు నిర్మించుకునేటప్పుడు మొక్కల కోసం ప్రత్యేకమైన స్థలం వదిలి నిర్మించుకునే అవకాశం ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఖాళీ స్థలం బాగా ఉండి కట్టుకునే పరిస్థితి ఉంటే అక్కడ పెంచే మొక్కలు ఇంటిపై ప్రభావం చూపిస్తుంటాయి.మొక్కలు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటాయి. అందుకే వృక్షో రక్షతి రక్షితః అంటారు.
ఇంట్లో మొక్కలు నాటే క్రమంలో ఉసిరిక, మారేడు అష్టైశ్వర్యాలను సిద్ధింప చేస్తాయి.
మారేడు చెట్టు సాక్షాత్తూ లక్ష్మీస్వరూపం. ఉసిరి చెట్టు విష్ణుస్వరూపం. అలాగే ఇంట్లో తులసిమొక్కల్ని ఒక వనంగా పెంచినట్లయితే సర్వాభిష్టములు సిద్ధిస్తాయి. పూజ కోసం ఇంకో ఇంటికి వెళ్లి పువ్వులు కోయడం మహాపాపం. ఆ ఇంటి యజమానిని అడిగిన తర్వాతే కోసుకోవాలి. రోడ్డు పక్కనే చెట్టు ఉంది కదా అని పువ్వులు అడగకుండా కోస్తే అది దొంగతనం కిందే లెక్కే. అలా తెచ్చిన పూలతో పూజ చేసినా ఫలితం ఉండదు.
అందుకే ఎవరి ఇంటి ప్రాంగణంలో వాళ్లు పువ్వల చెట్లు పెంచుకోవాలి. నిత్యారాధనలో తనకు తానుగా చెట్ల పూలను కోసేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకుని దైవచింతనా తత్వంతో ధ్యానిస్తూ పువ్వలు కోసి వాటితో దేవుడ్ని పూజించాలి. ఇలా ఇంట్లోనే మొక్కలు పెంచి పూలు కోసం దేవుడికి పెట్టడం వల్ల మన మనస్సుకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది.
రకరకాల మల్లె మొక్కలు, జాజి, చేమంతి వంటి మొక్కలు ఇంట్లో పెంచుకుని పూజచేయాలి. జాజి పూలతో పరమేశ్వరుడ్ని సేవిస్తే నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. చేమంతి, మందార పూలతో అమ్మ వారిని పూజిస్తే విశిష్టవంతమైన సౌఖ్యం ఆ దేవుడు కలిగిస్తాడు. గృహిణులకు సౌభ్యాగం కలుగుతుంది. పాలు కారే చెట్లు మాత్రం ఇంట్లో పెంచకూడదు . అలాగే పెద్ద పెద్ద వృక్షాలను ఇంటి ప్రాంగణంలో పెంచరాదు.