Bhairavakona Temple: 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిమీ దూరంలో భైరవకోన ఉంది.
ఇక్కడ ఒకే కొండలో మలిచిన 8శివాలయాలున్నాయి. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.
వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఒకే కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయి (గ్రానైట్) శిలలను చెక్కి ప్రతిష్ఠించారు.
సుమారు 250 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలోని గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.
అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే క్షేత్రంలో ఉండటం విశేషం.మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన దేవాలయాలను పోలిన నిర్మాణాలు భైరవకోనలో కనిపిస్తాయి.
ఎత్తైన కొండ ప్రాంతం, కొండల నడుమ కొలువుదీరి ఉన్న దేవాలయాలు, ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200 మీటర్ల ఎత్తు నుంచి పారే సెలయేరు పర్యాటకులకు వినూత్న అనుభూతిని మిగుల్చు తాయి.
జలపాతం నుంచి పడే నీటిలో అనేక మూలికలు, ఖనిజ లవణాలు ఉంటాయని.. ఈ నీరు తాగితే చాలా రోగాలు నయం అవుతాయని ఆ ప్రాంత వాసులు నమ్ముతారు.
కార్తీక పౌర్ణమి రోజు ఈ దృశ్యాన్ని తిలకించటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.