Nava Gangalu:గంగా నది స్నానం పరమపవిత్రం అంటారు. అలాంటి నవగంగల్లో స్నానం మరింత విశేష ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. అలాంటి నవగంగలు కలిసే ప్రాంతం కుంభకోణంలో ఉంది. నదులన్నీ పన్నెండేళ్ళకోసారి మహామఘం అనే పుష్కరిణిలో వచ్చి కలుస్తాయని ప్రతీతి. ద్వాపరయుగం అంతం అయ్యే సమయంలో ఆకాశంలో వెళ్తున్న అమృతభాండాన్ని వేటగాడి రూపంలో ఉన్న శివుడు బాణంతో కొడితే ఆ భాండం ముక్కలుగా విరిగి నేలమీద పడిందట. ఆ ప్రదేశమే కుంభకోణం. అలా విరిగిపడిన అమృతభాండపు ముక్కలు వివిధ శివలింగాలుగా రూపుదాల్చాయట. కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంభేశ్వర, సోమేశ్వర, చక్రపాణి, సారంగపాణి మొదలైన ప్రాంతాల్లో పడిన లింగాలు ఆలయాల లాగా రూపుదిద్దుకున్నాయట.
గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండంలో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడు. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు .సుగంధ ద్రవ్యాలనే లేపనంగా పూస్తారు. శివుడి ఆకారం కూడా కుండ మూతిలాగా ఉండటం ఇక్కడి ఒక విశేషం. చైత్ర మాసంలో సూర్యకిరణాలు శివలింగం మీద పడటం ఇంకొక విశేషం. అమ్మవారిని మంగళాంబిక అనే పేరుతొ కొలుస్తారు.
ఆరున్నర ఎకరాలలలో విస్తరించిన ఈ పుష్కరిణిలో 21 బావులు ఉన్నాయట. చుట్టూ రాతిమెట్లు ఇంకా 16 మండపాలు ఉన్నాయి. ప్రతి పన్నెండేళ్ళకి మాఘమాసంలో గురుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు ఈ మహామాఘ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నవగంగలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని నదుల నీరు వచ్చి ఇక్కడ కలుస్తుందని ఒక నమ్మకం. అందుకే పుష్కర సమయంలో కుంభకోణంలో దేవాలయాలన్నిటి నుండి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి స్నానం చేయిస్తారు. ఈ రోజు కనీసం 15లక్షల మంది పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి స్వామిని దర్శిస్తుంటారని అంచనా.