Guru Purnima: దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిర్డీ ఆలయంతోపాటు ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ భక్తులు వేకువజాబు నుంచే ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, దిల్ సుఖ్నగర్, వరంగల్ ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, కర్నూలులోని బాలాజీనగర్, నెల్లూరు, విజయనగరం, అనంతపురంలలోని ఆలయాలకు వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటున్నారు.
భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయం. గురువులను స్మరించుకుంటూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని భక్తులు గురుపౌర్ణమిగా నిర్వహించుకుంటున్నారు. అ వేద వ్యాసుడికి ప్రతీకగా ప్రారంభమైన ఈ పండుగ క్రమంగా ఆనవాయితీగా మారింది. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా పూజిస్తున్నారు.