Goda Devi Pooja:విష్ణుమూర్తి భక్తులు పరమ పవిత్రంగా భావించే ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుర్మాసం లో తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. అలానే ధనుర్మాసంలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. వైష్ణవులు పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. ఈ నెల అంటే విష్ణు మూర్తి కి చాలా ఇష్టం. నదీ స్నానాలు, పూజలు, జపాలు వంటి పుణ్య కార్యాలని ధను సంక్రమణ కాలంలో చేస్తే చాలా మంచి జరుగుతుంది. బ్రహ్మ ముహుర్తంలో నారాయణ పారాయణం చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు పొందొచ్చు. ఈ నెల రోజుల పాటు విష్ణు ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి ఉంటుంది. గోదా దేవి అమ్మవారు నెల రోజుల పాటు దీక్ష చేసి భోగీపండగ రోజున రంగనాథస్వామిని వివాహ మాడుతుంది.
అలానే ఈ నెల లో పెళ్లి కాని కన్యలు ఇళ్ల ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజలు చేస్తే చాలా మంచిది. అందుకే చాలా మంది గొబ్బెమ్మలు పెట్టి, వాటి మీద బియ్యం పిండి, పసుపు, కుంకుమలతో పూజిస్తారు. పూలతో కూడా పూజిస్తారు. గోదాదేవి మార్గళి వ్రతం పేరిట మహా విష్ణు మూర్తి ని పూజిస్తే మోక్షం వస్తుంది. తిరుప్పావై పారాయణం చేస్తే వివాహం కానీ వారికి వివాహం అవుతుంది. కానీ ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఈ నెల లో ఆచరిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అనుకున్నవి జరుగుతాయి.యుక్త వయసులో ఉన్న వారు నెలరోజుల పాటు గోదాదేవి పూజల్లో పాల్గొంటే వివాహాలు జరుగుతాయని భావిస్తారు.
ఈ ధనుర్మాసం ప్రారంభం రోజు నుంచి కనుమ వరకు ప్రతి ఇంటి వాకిళ్లలో మహిళలు ముగ్గులు వేస్తుంటారు. మేలు కొలుపులు, గంట జంగాలు పాటలు, గంగిరెద్దుల ఆటలు, కోడిపందెళ్లతో గ్రామాల్లో ఈ నెల రోజులూ పండగ వాతావరణం ఉంటుంది. హరిదాసులు, గుమ్మడి కాయ వంటి గిన్నెను నెత్తిన పెట్టుకొని, హరి సంకీర్తనలతో ప్రతి ఉదయం ఇంటి ముందుకు రావటం ధనుర్మాసం ప్రత్యేకత. హరి సంకీర్తనలతో శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. భూమిని నెత్తిన పెట్టుకొని వచ్చిన సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా హరిదాసును భావిస్తారు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారు జామునే నిద్రలేచి స్నానమాచరించి, శ్రీ మహావిష్ణువును ఆవు పాలు, కొబ్బరి నీళ్లు మొదలగు పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే స్వామి కటాక్షం లభిస్తుంది. ధాన్య లక్ష్మీ ఇంటికి చేరే సమయం కూడా ధనుర్మాసమే.