Sitaram kalyanam : రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశ తత్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించింది. అంటే, సీతమ్మ భూతత్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశ తత్వం రామయ్య. ఈ రెండింటి మధ్యలోనే మిగిలిన మూడు తత్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో వాన చినుకుగా మారి అప్పుడు పుడమి పులకరించి సస్యాన్ని అందిస్తుంది. అది భూమి మీద ఉన్న జీవులన్నింటికి ఆహారంగా మారి, శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడు రామయ్య సీతమ్మను చేరుకుంటాడో అంటే సీతారామ కల్యాణం జరుగుతుందో అప్పుడే లోకానికి శక్తి అందుతుంది. ఈ విధంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, శాంతి దాయకంగా నిలుస్తుంది.
లౌకిక వ్యవహారంలో చూసినా, సీతారామ కల్యాణం సంవత్సరంలో మొదటి రుతువు, మొదటి నెలలో జరుగుతుంది. అంటే, కొత్త సంవత్సరంలో జరిగే తొలి వివాహం సీతారాముల కల్యాణమే. శిశిరంలో ఆకులు రాలి మోడుగా తయారైన చెట్లు, వసంతం రాగానే చిగురించి, నూతన శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడు సీతారామ కల్యాణం జరుగుతుందో అప్పుడు నవవసంతం మొదలవుతుంది. ఎవరు సీతారామ కల్యాణం జరుపుతారో, వారి జీవితాల్లో నవవసంతం నిత్యవసంతంగా మారుతుంది. ఇదీ సీతారామ కల్యాణ వైభవం.
శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే వంగింది. కేవలం రాముడి కర స్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివధనుస్సు రెండుగా విరిగి పోతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.
భార్యాభర్తలు అంటే సీతారాముల్లా ఒకరికొకరుగా ఉండాలనడం, నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించడం, ఉత్తమసాధ్విని సీతమ్మ తల్లిగా పిలవడం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనడం, శ్రీరామనవమి రోజున సీతాకల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించడం ఇప్పటికీ కొనసాగుతుందంటే ఆ గొప్పతనం అంతా సీతారాములదే…