Elinati Shani: ఏలినాటి శని హిందీలో సాడే సాతి అని కూడా అంటారు. అంటే ఏడున్నర సంవత్సరాల శని అని అర్థం. ఎవరి జాతకం లో నైనా ఉన్న జన్మ చంద్రుడుని గోచారంలోని శనితో పోల్చి చూస్తారు. జన్మ జాతకంలోని చంద్రుడిని గోచారంలో శని తో పోల్చినప్పుడు గోచార శని జన్మ జాతక చంద్రుడి స్థానం నుంచి 12 వ స్థానంలోనూ ఒకటవ స్థానంలోనూ రెండవ స్థానంలోనూ సంచరిస్తే అప్పుడు ఏలినాటి శని గా పరిగణిస్తారు.
అయితే శని గ్రహం సహజంగా ఒక రాశిని దాటడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అలా ఏడున్నర సంవత్సరాలు దాటడానికి మూడు రాశుల్లో శని సంచరిస్తుంటాడు. మొదటి రెండున్నరేళ్లు ఏ రాశిలో అయితే ఉంటాడో అప్పుడు ఆ రాశికి ముందు ఉన్న రాశికి అప్పటికే రెండున్నరేళ్ల శని అయిపోయి ఉంటుంది. అంతకన్నా ముందు ఉన్న రాశికి ఆఖరి దశ ఏలినాటి శని నడుస్తూ ఉంటుంది.
మకరరాశి వాళ్లకు ఏలినాటి శని ఆఖరు దశలో ఉంది. అంటే మకర రాశి తర్వాత వచ్చే కుంభ రాశికి ఇప్పటికే రెండవ దశ ఏలినాటి శని, మీన రాశి వాళ్లకు మొదటి రెండున్నరేళ్ల శని కాలం నడుస్తుంది. అయితే మకర రాశి వారికి నడుస్తున్న ఆఖరు దశలో కూడా మిగిలింది. ఇక తొమ్మిది నెలల కాలమే.. అందుకే ఈ 9 నెలల కాలంలో మొదటి ఆరు నెలలు శనీశ్వరుడు మరింత విజృంభిస్తాడని.. తన అసలు విశ్వరూపం చూపిస్తాడని పండితులు హెచ్చరిస్తున్నారు.
గడచిన ఆరు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మకరరాశి వారు ఏన్నో ఒడిదుడుకులు ఏదుర్కొనే ఉంటారు. ఏ పని చేసినా కలిసి రాకపోవడం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో విసిగి వేసారిపోయి ఉంటారు. ఒక సందర్భంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా వచ్చి ఉంటాయని. కానీ ఎవ్వరూ కూడా చనిపోరని అదంతా ఏలినాటి శని ప్రభావంతో వచ్చే కర్మలో భాగమే అంటున్నారు పండితులు. అయితే ఈ ఆరున్నర ఏండ్లలో ఇచ్చిన కష్టాల కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా తన పవర్ చూపిస్తాడని పండితులు చెప్తున్నారు. వచ్చే ఆరు నెలలు మకరరాశి జాతకులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అయితే శని పట్టిందనగానే చాలా మంది ఇక తమ జీవితం అయిపోయింది అన్నట్లుగా భయపడుతుంటారు. ఇక జీవింతంలో ఏం చేసినా కలిసిరాదన్న బావనలోకి వెళ్లిపోతారు. అసలు కొంత మందైతే తమ భవిష్యత్తు అగమ్యగోచరం అని నిట్టూరుస్తారు. అయితే ఏలినాటి శని అనగానే భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పండితులు. శని ఆయు కారకుడు. మందగమనుడు కనుక చేపట్టిన పనులు ఆలస్యం చేస్తాడే కానీ అసలు కాకుండా చేయడని చెప్తున్నారు.
హనుమాన్ చాలీసా పారాయణ: శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు అతి సులువైన పవర్ ఫుల్ మార్గం హనుమాన్ చాలిసా పారాయణం చేయడమేనట. హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు చాలా శక్తివంతంగా పని చేస్తాయట. ఈ 40 శ్లోకాలను జపించడం వల్ల శనీశ్వరుడు ఉపశమిస్తాడట. పైగా హనుమాన్ భక్తులను నేను ఎప్పటికీ ఏమీ చేయనని శనీశ్వరుడు, హనుమాన్ కు ఒకానొద దశలో మాటిచ్చాడట. అందుకే ప్రతి మంగళ, శని వారాల్లో హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు సూచిస్తున్నారు.
అలాగే విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయడంతో పాటు శివ పంచాక్షరీ మంత్రాన్ని రెగ్యులర్ గా జపించడం ద్వారా కూడా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడట. ఇక యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుందట. నల్ల బట్టలో నల్ల నువ్వులు మూటలా కట్టి శనీశ్వరుడికి సమర్పించాలని.. నువ్వుల నూనెతో శని దేవుడికి దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. ఆలయంలోని నవగ్రహాలకు రెగ్యులర్ గా 9 సార్లు ప్రదక్షిణలు చేస్తుండాలని.. అలాగే శనీశ్వరుడికి ప్రత్యేకంగా 19 ప్రదక్షిణలు చేయాలని సూచిస్తున్నారు.
ఇక గురువు ఆశీస్సులు ఉన్నవారిని శని ఏమీ చేయడని అందుకోసం దత్తాత్రేయుడిని ఆరాధించడం. దక్షిణామూర్తిని పూజించడం చేయాలట. అయితే శని ఏడున్నర సంవత్సరాలు ఎన్ని బాధలు పెట్టినా.. ఎంత హింసించినా అదంతా పూర్వజన్మ కర్మలో భాగమేనట. ఇంత కాలం బాధించిన శని పోతూ పోతూ అద్బుతమైన జీవితాన్ని ఇస్తాడని.. ఎవరూ ఊహించని డెవలప్ మెంట్ లైఫ్ లో వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.