Vaikuntham:జంబూద్వీపంలో భారతదేశం ఉత్తమమైన దేశం. అలాగే క్షేత్రాల్లోకెల్లా నైమిశారణ్యం శ్రేష్ఠమైనది. పవిత్రమైన తొమ్మిది అరణ్యాలలో నైమిశారణ్యం ఒకటి. ఇక్కడ ఎవరైతే ప్రాణాన్ని శరీరాన్ని వదిలిపెడతారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.. నైమిశారణ్యం అన్ని తీర్థాల్లోకి ప్రసిద్ధమైన తీర్థం. సిద్ధులన్నీ ప్రసాదించగలిగేది.
నైమిశారణ్యం ఎందరో గొప్ప ఋషులు, మునులు తపస్సు చేసిన పుణ్యభూమి. ఈ నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరంలో ఉంది. ప్రాచీన చరిత్ర, భూగోళ వివరాల ప్రకారం నైమిశారణ్యం పాంచాల రాజ్యానికి, కోసల రాజ్యానికి మధ్య ఉన్న ప్రదేశం. ఉగ్రశ్రావశౌతి ముని మహాభారత కథను వేల శ్లోకాలతో రచించి ఏకబిగిన గానం చేసిన ప్రదేశం. అలాగే శ్రీరామచంద్రుడు అశ్వమేధయాగం చేసిన సమయంలో లవకుశులు అక్కడకు వచ్చి వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశమని కూడా ప్రసిద్ధి.
తీర్థ ప్రదేశాలన్నింటిలోను ఉత్తమ తీర్థమని, పుణ్యక్షేత్రాలన్నింటిలోను ఉత్తమ పుణ్యక్షేత్రమని మునులు, ఋషులు ఇక్కడ నివసిస్తారని పరిగణించబడింది. నైమిశారణ్యం ముల్లోకాల్లోను ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ పుణ్యతీర్థం. శివునికి అత్యంత ప్రియమైన ప్రదేశం. మానవులు చేసే మహాపాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం. ఇక్కడ దానం, తపస్సు శ్రాద్ధకర్మలు, యజ్ఞాలు ఏమైనా సరే ఒకసారి చేసినా ఏయేడు జన్మల పాపాలన్నీ పోతాయని అనేక పురాణాల్లో వివరించబడింది. నైమిశారణ్యం గొప్పతనాన్ని పురాణాల్లోను, ధర్మశాస్త్రాలలోను ప్రస్తావించారు.
తీర్థస్థలాలు అన్నింటిలోనూ నైమిశారణ్యం అనే తీర్థం అన్ని పుణ్యతీర్థాలు దర్శించిన ఫలాన్ని అందిస్తుంది. అంటే అక్కడ అన్ని తీర్థాలు ఉంటాయని పురాణాల్లో ఉంది. నైమిశారణ్యం శివక్షేత్రం. సకల సిద్ధులు అందించే ఉత్తమ క్షేత్రమని కూర్మపురాణంలో తెలిపారు. దేవీ భాగవతంలోను, స్కందపురాణంలోను, బృహధర్మోపపురాణాల ప్రకారం నైమిశారణ్యం కలియుగ ప్రవేశానికి సంభవం కాదు. కలియుగ ప్రవేశం జరుగలేదు కనుకనే నైమిశారణ్యంలో ఎప్పుడూ సత్యయుగమే నడుస్తూ ఉంటుంది. గంగానది ఒడ్డుమీద ఒక యోజనం నడిస్తే యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. కాశీలో యోజనంలో నాలుగోవంతు నడిచినా అదే ఫలం లభిస్తుంది. అలాగే కురుక్షేత్రంలో ఒక క్రోసు దూరం నడిచినా, నైమిశారణ్యంలో ఒక్కొక్క అడుగు నడిచినా యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది.