Eight temples : దేవుడి విగ్రహం ఒకే ప్రాంతంలో ఒక రూపంలో ఉండటం మాములే కానీ. భైరవకోన మాత్రం ఇందుకు భిన్నమైంది. ఈ పుణ్యక్షేత్రంలో కోటి లింగాలు ఉన్నాయని తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు మొదలైన చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలాగే, భైరవకోనలో అనేక కోనేరులు ఉన్నాయి. ఇక్కడ ఇంకా చిత్రమైన, అపురూపమైన విషయం ఏమంటే ఒకే రాతితో ఎనిమిది ఆలయాలు నిర్మించడం.
ప్రకాశం జిల్లా సీ.ఎన్. పురం మండలంలో అంబవరం కొత్తపల్లి గ్రామానికి దగ్గర్లో ఉంది భైరవకోన. ఎనిమిది ఆలయాల్లో ఎనిమిది రకాలుగా శివ రూపాన్ని మలిచారు. భైరవకోనలో భైరవేశ్వరుని ఆలయంతో బాటు, త్రిముఖ దుర్గాదేవి దేవాలయం ప్రసిద్ధి పొందింది. భారతీయ వాస్తు శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనం భైరవకోన. ఏక శిలపై వెలసిన అష్ట ఆలయాలు, మరెన్నో విశిష్టతలు, భైరవకోనను అరుదైన పుణ్యక్షేత్రంగా నిలిపాయి
భైరవకోనలో భైరవుని ప్రతిమకు ఎదురుగా ఉన్న ఎనిమిది ఆలయాల్లో శివలింగ రూపాలను తీర్చిదిద్దారు. శిసినాగు శివలింగం అమర్నాథ్ లోయలో షోడశ కళాత్మకమైన శివలింగాన్ని తలపిస్తుంది. క్షేత్రంలో ఏడు ఆలయాల మధ్యలో సుమారు రెండు అడుగుల లోతున దుర్గాదేవి ఆలయం ఉంది. అనేక విశిష్టతలకు తోడూ, కనకదుర్గాదేవి విగ్రహమూ అద్భుతంగా కనిపిస్తుంటుంది. దుర్గమ్మ తల్లి సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవిల ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంటారు. దుర్గామాత ఎదురుగా శివరూపాన్ని ప్రతిష్టించడం మరో విశిష్టత.
ఏటా కార్తీక పౌర్ణమి రోజున రాత్రి 7-9 గంటల సమయంలో చంద్రుని కిరణాలు దుర్గాదేవి ఆలయంలో ప్రసరిస్తాయి. కేరళ, శబరిమలై క్షేత్రంలో సంక్రాంతినాడు మకర జ్యోతిని వీక్షించడానికి లక్షలాదిమంది తరలివచ్చినట్లే, భైరవకోన దుర్గాదేవి ఆలయంలో కార్తీక పూర్ణిమ నాడు దేవిపై ప్రసరించే చంద్ర కిరణాలను చూట్టానికి భక్తులు పోటెత్తుతారు. ఏ. ఇక్కడి కాశీ విశ్వేశ్వర లింగాన్ని పూజించడం చాలా శ్రేష్టం. నిత్యం కోలాహలంగా ఉండే భైరవకోన మహా శివరాత్రి పుణ్య దినాల్లో మరింత రద్దీగా ఉంటుంది.