Dussehra Special : త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించిన మూలశక్తిని కొలుచుకునే సందర్భం దసరా నవరాత్రులు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మలగన్న ఆ అమ్మను నవ రూపాల్లో ఆరాధిస్తూ.. నవశక్తిని సంతరించుకుంటాం. లలితా సహస్రనామ పారాయణతో, కుంకుమార్చనలతో కొలిచిన వారికి కొంగుబంగారమై కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. పురాణ ఇతిహాల ప్రకారం మొత్తం మనకు మొత్తం 18 శక్తి పీఠాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో ఈ నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం.
దేవి నవరాత్రులు.. శరద్ నవరాత్రులు, శరన్నవరాత్రులు, శారదీయ నవరాత్రులు.. ఇలా పేర్లు వేరైనా ఆ అమ్మను కొలుచుకోవడమే దేవీ నవరాత్రి ఉత్సవాల సారాంశం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అయితే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకమనే చెప్పాలి. దేశం వెలుపల, బయట ఉన్న ఈ శక్తీ పీఠాల్లో ఈ తొమ్మిది రోజుల పాటు వేడుకలు కన్నులపండువగా కొనసాగుతాయి.
ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. మొత్తం 18 శక్తిపీఠాల్లో నాలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలో ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో గయ, పిఠాపురం, జాజ్పూర్ మూడు గయాక్షేత్రాలూ కాగా శ్రీశైలం, ఉజ్జయిని రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలుండటం మరో విశేషం. సతీ దేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని వాటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్టు చెప్పే చోటు ఇది. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ చాలా వేడుకగా జరుగుతాయి ఉత్సవాలు.
సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ఓ ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడి వధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శ్రీశైలంలో జరిగే నవరాత్రి ఉత్సవాలను శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహిస్తారు.
సతీదేవి ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. దక్షుడు యజ్ఞం తలపెట్టిన ఈ ప్రాంతాన్నే దక్ష వాటిక అని కూడా పిలుస్తారు. ద్రాక్షారామం దక్షిణకాశీగా కూడా పేరు గాంచింది. ఈ ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది. మామూలు సమయాల్లోనే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తగా.. నవరాత్రుల సమయంలో ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా, హూంకారిణిగా నవరాత్రుల్లో భక్తుల పూజలందుకుంటోంది.