Dussehra Festival 2023 : తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగైన దసరా పర్వదినంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దసరా పండుగను ఈనెల 23న జరుపుకోవాలో, 24న జరుపుకోవాలో.. తెలియని అయోమయంలో ఉన్నారు. అయితే.. కొందరు పండితులు 23వ తేదీన జరుపుకోవచ్చని సూచిస్తుంటే.. మరికొందరు 24నే జరుపుకోవాలంటున్నారు. దీంతో ఏది నిజం అనేది తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు క్యాలెండర్లు తిరిగేస్తూ.. తిథులు లెక్కిస్తున్నారు.
అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి ప్రసిద్ధి గాంచినది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత వైభంగా జరుపుకుంటారు. ఒక్కో ఊరిలో ఒక్కోలా పండుగను జరుపుకుంటారు. ఎక్కడికక్కడే దసరా పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాస శుద్ధ దశమినాడు జరుపుకునే ఈ పర్వదినం వెనుక ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయి. విజయదశమి రోజు దుర్గామాత మహిషాసురుడిని వధించిందని ఓ కథనం చెబుతుంటే… రావణుడిని చంపి సీతమ్మను రాక్షసుల చెర నుంచి విడిపించిన రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడని మరో కథనం చెబుతోంది. దీనికి ప్రతీకగానే ఉత్తరాదిన విజయదశమిని ఘనంగా జరుపుకుంటూ రావణ, ఇంద్రజిత్తుల దిష్టి బొమ్మలను దహనం చేస్తారు.
పాండవుల గాథ కూడా విజయదశమికి ముడిపడి ఉంది. పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండుగ సందర్భంగా ఆయుధపూజతోపాటు జమ్మి చెట్టును కూడా పూజించి.. అందరికీ విజయం సిద్ధించాలని కోరుకుంటూ జమ్మిని ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
ఇలాంటి పండుగను ఎప్పుడు జరుపుకోవాలన్న సందిగ్ధతతో జనం అయోమయంలో ఉన్నారు. అయితే.. ఇదే విషయంపై దుర్గగుడి పండితులు ఉమాకాంత్ క్లారిటీ ఇచ్చారు. దుర్గమ్మను కొలిచే వారు. దేవస్థానాన్ని అనుసరించే వాళ్లు 23వ తేదీన దసరా మహోత్సవాన్ని జరుపుకోవచ్చని.. తిథిని అనుసరించే వారు 24వ తేదీన జరుపుకోవచ్చని విజయవాడ దుర్గగుడి పండితులు ఉమాకాంత్ తెలిపారు.
వరంగల్ భద్రకాళి ప్రధాన అర్చకులు 23వ తేదీనే దసరా పండుగను జరుపుకోవాలంటున్నారు. వర్షకృత్య ప్రాతిపదిపకలో శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం వరకూ, సాయంత్రం దశమి తిథి వస్తుంన్నందున అక్టోబర్ 23వ తేదీనాడే దసరా పండుగను జరుపుకోవాలని తెలిపారు. సిద్ధాంతులంతా కలిసి తెలంగాణ విద్యసభ తీసుకున్న నిర్ణయం కారణంగా 23వ తేదీన పండుగ జరుపుకోవాలని భద్రకాళి ప్రధాన అర్చుకులు శేషు సూచిస్తున్నారు.