Durga Puja : రాజులు లేరు. రాజ్యాలు లేవు. అయినా ఓ రాజకుటుంబం అనుసరించిన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. వెయ్యేళ్ల క్రితం చేపట్టిన దుర్గామాత పూజలు క్రమం తప్పకుండా ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ విశిష్ఠమైన ప్రాంతం పశ్చిమబెంగాల్లో ఉంది.
బంకుర జిల్లాలోని విష్ణుపూర్ ఒకప్పుడు మల్ల రాజులు ఏలుబడిలో ఉంది. 997 సీఈలో విష్ణుపూర్ను ఏలిన రాజు జగత్ మల్ల దుర్గామాతను కొలిచేవారు. ఆయన వంశస్థులు ఆ ఆచారాన్ని అలాగే, అక్కడే కొనసాగిస్తూ వచ్చారు. ప్రాచీన కాలం నుంచి.. అంటే 1027 ఏళ్లుగా దుర్గామాత పూజలు అందుకుంటున్నది విష్ణుపూర్లోనే.
దుర్గాపూజకు 15 రోజుల ముందు నుంచే అక్కడ కోలాహలం ఆరంభమవుతుంది. ఈ ఏడాది కూడా అక్టోబర్ 8వ తేదీ నుంచే భక్తులు పోటెత్తారు. అమ్మవారు కొలువుదీరిన ముర్చార్ కొండపై పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దుర్గా మాత అవతారమైన మా మృణ్మయిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మల్ల రాజులు ఈ గుడి కట్టించినందున అప్పట్లో ఈ ప్రాంతాన్ని మల్లభుంగా పిలిచేవారు.
ప్రస్తుతం ఆ రాజవంశానికి చెందిన 63వ తరం దుర్గామాతను పూజిస్తోంది. ఇక్కడ దుర్గా పూజ జరిగే విధానం ఎంతో భిన్నంగా ఉంటుంది. పూజ సందర్భంగా పఠించే మంత్రాలను కూడా సంప్రదాయ పద్ధతితో పోల్చలేమని మల్ల రాజవంశానికి చెందిన జ్యోతి ప్రసాద్ సింగ్ ఠాకూర్ చెప్పారు. పూజలు నిర్వహించే సమయంలో ఫిరంగులను మూడు సార్లు పేలుస్తారు. 1600వ సంవత్సరం నుంచి ఈ ఆచారం మొదలైంది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది.
1992లో ఫిరంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో 22 కిలోల మందుగుండు అవసరమైన పెద్ద ఫిరంగులను వాడటం నిలిపివేశారు. దాని స్థానంలో 7-8 కిలోల మందుగుండును పేల్చే చిన్నపాటి ఫిరంగులను వాడుతూ వస్తున్నారు. పూజలు ముగిసిన తర్వాత దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసే ఆచారం మాత్రం అక్కడ పాటించడం లేదు. విగ్రహాలంకరణ మాత్రం 1027 ఏళ్లుగా ఒకేలా కొనసాగడం మరో విశేషం.