Badrinath Temple Opening Today: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ధామ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య బద్రీనాథ్ ధామ్ ఆలయ తలపులు తెరచుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా చేరుకున్నారు. బద్రీ విశాల్ లాల్ కీ జై అంటూ భారీగా నినాదాలు చేశారు. ఆలయ తలుపులు తెరుస్తున్న నేపథ్యంలో గుడిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించారు.
అయితే, ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న అలకనంద నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని శీతాకాలంలో మూసి వేస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆలయంలో విష్ణువుడు బద్రీనాథునిగా కొలువై ఉన్నాడు. దక్షిణాన ఉన్న ఆలయ ద్వారం నుండి ఆలయ ప్రాంగణానికి కుబేర్ జీ, శ్రీ ఉద్దవ్ జీ గడు ఘడను తీసుకువచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ మెంబర్స్, అధికారులు, వేలాది మంది భక్తుల సమక్షంలో పూజాకార్యక్రమాలు నిర్వహించి ఆలయ తలుపులు తెరిచారు. ఆదివారం ఉదయం తెరుచుకున్న ఆలయ తలుపులు నవంబర్ వరకు తెరిచే ఉంటాయి.
అదేవిధంగా ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజుల నుంచి కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా ఈ ఆలయాలను సందర్శిస్తుంటారు. ప్రతిసారి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చి, ఈ ఆలయాలను సందర్శిస్తారు.
Also Read: తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు.. ఆలయంలో ప్రత్యేక పూజలు
ఏప్రిల్ చివరిలో లేదా మేలో చార్ ధామ్ తీర్థయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర నవంబర్ వరకు కొనసాగుతుంది. ఆ తరువాత శీతాకాలం ప్రారంభవడంతో ఆలయ దర్శనం ఉండదు. ప్రతీ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు చార్ ధామ్ యాత్ర చేస్తుంటారు.