Shivalinga: శివునికి ఎంతో మంది హిందువులు పరమ భక్తులు. ఆచారం ప్రకారం ప్రతి సోమవారం మహా శివుడిని పూజిస్తూ ఉంటారు. శివుడిని లింగాకారంలో పూజించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అన్ని దేవుళ్లకు పెట్టే ప్రసాదాన్ని చివరిలో భక్తులు తింటారు. కానీ శివలింగానికి సమర్పించిన ప్రసాదాన్ని మాత్రం తినరు. ఏ ఆలయంలో కూడా శివలింగానికి సమర్పించిన ప్రసాదం భక్తుడికి తిరిగి ఇవ్వరు. శివలింగం దగ్గర ఉన్న ప్రసాదాన్ని నదుల్లో లేదా పవిత్రమైన చెట్టు దగ్గర వదిలేయడం మంచిదని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి.
శివలింగానికి సమర్పించే నైవేద్యాలు
శివలింగం అనేది శివుని రూపం. ఎక్కువగా మహాశివుడిని శివలింగం రూపంలోనే పూజిస్తూ ఉంటారు. శివలింగానికి ఎక్కువగా గంగాజలం, పంచామృతం, తేనే, పండ్లు, పువ్వులు, పాలు వంటి సమర్పిస్తూ ఉంటారు. అవేవీ కూడా తిరిగి భక్తుడు తీసుకోకూడదు. ఏ పూజారి కూడా తిరిగి ఇవ్వరు. అభిషేకం సమయంలో ఈ వస్తువులను కూడా శివలింగంపై పోస్తూ ఉంటారు.
ప్రసాదం ఎందుకు తినకూడదు?
శివలింగానికి సమర్పించిన ప్రసాదం ఏదైనా కూడా దాన్ని తినకూడదని పురాణాలు చెబుతున్నాయి. దీనికి చండేశ్వరుని కథ కూడా వాడుకలో ఉంది. శివుని నోటిపై చండేశ్వరుడు నివసిస్తారని అంటారు. చండేశ్వరుడు ఆత్మలకు అధిపతి. అంటే శివుడు నోటితో తాకిన ఏ ప్రసాదం అయినా చండేశ్వరుడు లేదా అతని వంశానికే చెందుతుంది. చండేశ్వరునికి చెందిన ఏ ఆహారాన్ని అయినా తీసుకోవడం మహా పాపం. శివుడికి ప్రసాదాన్ని నివేదించినప్పుడు శివుడు భక్తుడి భాగాన్ని తీసుకుంటాడు. మిగతా భాగం చండేశ్వరుడికే చెందుతుంది. అందుకే శివలింగంపై సమర్పించిన ఏ ఆహారాన్ని తినకూడదు.
శివలింగానికి పెట్టిన ప్రసాదం తినకూడదని చెప్పేమరో కథ కూడా వాడుకలో ఉంది. సముద్రం మధనం చేసేటప్పుడు విషం ఉద్భవించింది. ఆ విషాన్ని శివుడు తాగాడు. అలా తాగినప్పుడు ఆ విషం శరీరమంతా చేరకుండా తన గొంతులోనే ఆపివేశాడు. ఆ విషం గొంతును నీలిరంగులోకి మార్చడంతో ఆయన నీలకంఠుడిగా అయ్యాడు. విషం శివుడి గొంతులోనే ఉండిపోతుంది… కాబట్టి శివలింగంలో కూడా దాని లక్షణాలు ఉంటాయని నమ్ముతారు. కాబట్టి మీరు శివలింగానికి సమర్పించే ప్రసాదాన్ని తిన్నప్పుడు ఆ విషం లక్షణాలను కూడా తీసుకున్నట్టే అవుతుంది. అందుకే శివలింగానికి పెట్టిన ఆహారాన్ని తినకూడదని చెబుతారు.
Also Read: ఇంట్లో గందరగోళం ఉందా ? గులాబీ మొక్కలతో జాగ్రత్తగా ఉండండి
అయితే శివలింగానికి కాకుండా శివుడి విగ్రహం ముందు లేదా శివుడి ఫోటోల ముందు పెట్టిన ఆహారాన్ని మాత్రం తినవచ్చు. శివలింగం ముందు పెట్టిన ప్రసాదం తింటే మోక్షం కూడా త్వరగా వస్తుందని, జననమరణ చక్రాల నుండి వెంటనే విముక్తి కలుగుతుందని కొంతమంది విశ్వాసం. మోక్షం అంటే మనిషి చివరి ఘట్టం. ఆ మోక్షాన్ని చేరడానికి కొన్ని చక్రాలను పూర్తి చేయాలి. శివలింగం ముందు ఉంచిన ప్రసాదాన్ని తినడం వల్ల చక్రాలు ఏవీ పూర్తి చేయకుండానే దానికి భంగం కలిగించినట్టు అవుతుంది. అందుకే లింగానికి సమర్పించిన ఏ ఆహారాన్ని ముట్టుకోకపోవడమే ఉత్తమం.
శివలింగాలన్నీ ఒకేలా ఉండవు. అలాగే ఒకే పదార్థంతోను తయారు చేయరు. కొన్ని ఇసుకతో చేస్తే, కొన్ని రాతితో చేస్తారు. మరి కొన్ని మట్టితో, మరికొన్ని బంగారం, వెండి, విలువైన రాళ్లతో కూడా తయారు చేస్తారు. రాతితోనూ, మట్టితోను చేసిన శివలింగాలు కాకుండా లోహాలతో చేసిన శివలింగాల ముందు అంటే వెండి, బంగారం, ఇతర లోహాలతో చేసిన శివలింగాల ముందు ఉంచిన ఆహారాన్ని మాత్రం తినవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఇసుక, రాతితో, మట్టితో చేసిన శివలింగాల ముందు ఉంచిన ఆహారాన్ని తినకపోవడమే ఉత్తమం.